బీజేపీ లో మున్సిపల్ ఎన్నికల జోష్: టీఆర్ఎస్పై కమలం దూకుడు
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికార టీాఆర్ఎస్పై ఎదురు దాడిని ప్రారంభించింది.
హైదరాబాద్:తెలంగాణ బిజెపిలో మున్సిపల్ ఎన్నికలు కొత్త జోష్ నింపాయి. పలు మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో కమలనాథులు రెండో స్థానం లోకి రావడం రాష్ట్ర పార్టీ నేతల్లో ఆశలు నింపుతున్నాయి.
రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు స్థానాలు నుంచి ఒక స్థానానికి పడిపోయిన కమలనాథులు ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు స్థానాలు సాధించి తమకు రాష్ట్రంలో కష్టపడితే భవిష్యత్తు ఉందన్న సంకేతాలు పార్టీ నేతలు అందుకున్నారు.
బీజేపీ విజయం సాధించిన నాలుగు ఎంపీ స్థానాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవితను ఓడించడం ఆ పార్టీ నేతలకు మరింత కిక్ ఇచ్చింది.ఇక అప్పటి నుంచి రాష్ట్రంలో అధికార పార్టీపై బీజేపీ దూకుడును పెంచింది. ప్రభుత్వ తీరును ఎండగట్టడం మొదలుపెట్టింది.
తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 10 కార్పొరేషన్లలో బిజెపి పార్టీ మరో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీని వెనక్కు నెట్టి రెండో స్థానానికి వచ్చింది. అధికార పార్టీ విజయం సాధించిన స్థానాలను పరిశీలించినట్లయితే మెజారిటీ స్థానాల్లో బిజెపి రెండో స్థానంలో కొనసాగుతుండగా కాంగ్రెస్ మూడో స్థానంలో ఉంది.
పట్టణ ప్రాంతాల ఎన్నికలు కావడం గతంలో బిజెపి కి ఉన్న పట్టు ప్రస్తుతం క్షేత్రస్థాయిలో అనుసరిస్తున్న వ్యూహాలు తమకు కలిసి వస్తున్నాయని బిజెపి నేతలు అభిప్రాయపడుతున్నారు.
ఈ కారణంగానే తమకు ఓటర్ల మద్దతు దక్కిందని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీ అభ్యర్థులను ముందుండి నడిపించే నేతలు లేకపోవడం కూడా కాంగ్రెస్ పార్టీకి మైనస్ గా మారిందని అంటున్నారు.
ముగ్గురు ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గాల పరిధి లో బిజెపి పాగా వేయ లేకపోయినా ఓట్ల శాతంలో మాత్రం టిఆర్ఎస్ తర్వాత బిజెపి ఆ స్థానాన్ని దక్కించుకుంది.పలు మున్సిపాలిటీల్లో ఇదే పరిస్థితి నెలకొంది.
బీజేపీ అభ్యర్థులు గతం కంటే మెరుగ్గా విజయం సాధించినా మున్సిపాలిటీ ఛైర్మెన్ స్థానాలను మాత్రం పెద్దగా కైవసం చేసుకోలేకపోయింది.ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం బీజేపీకి పురపోరులో 20 శాతనికి పైగా ఓట్లు దక్కాయని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.