పార్టీలో కొత్త వారు చేరుతున్నారని.. వారిని అడ్డుకోవద్దని హితవు పలికారు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా. నెల నెలా ప్రణాళికలు సిద్ధం చేసుకుని క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని పదాదికారులను ఆయన ఆదేశించారు
పదాదికారుల సమావేశంలో బీజేపీ (bjp) జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా (jp nadda) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నెల నెలా ప్రణాళికలు సిద్ధం చేసుకుని క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని ఆదేశించారు. పార్టీకి మీరు పనిచేయడం కాదని.. పార్టీనే పనిచేసే అవకాశం ఇచ్చిందని భావించాలన్నారు. ప్రణాళికలు లేకుండా ఏ నాయకుడు పర్యటనలు చేయవద్దని ఆయన సూచించారు. కొత్త వారు పార్టీలో చేరుతున్నారని.. వచ్చే వారిని ఆహ్వానించాలని, అడ్డుకోవద్దని జేపీ నడ్డా హితవు పలికారు. పార్టీలో ప్రాధాన్యతపై ఇంకొకరితో పోల్చుకోవద్దని ఆయన సూచించారు.
ఇక, మహబూబ్నగర్ సభకు జేపీ నడ్డా హాజరుకానున్న నేపథ్యంలో భారీగా జనసమీకరణ చేయడంపై రాష్ట్ర బీజేపీ నాయకులు దృష్టి సారించారు. కనీవినీ ఎరగని రీతిలో జేపీ నడ్డా సభను సక్సెస్ చేద్దామని, పాలమూరు గడ్డ బీజేపీ అడ్డా అని బండి సంజయ్ (bandi sanjay) అన్నారు. బీజేపీ కార్యకర్తల సత్తా చూపాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా మండలాలు, గ్రామాలు, బూత్ ల వారీగా జన సమీకరణపై దృష్టి సారించి సభను విజయవంతం చేయాలన్నారు.
ఇక, బండి సంజయ్ ఏప్రిల్ 14న తన రెండో దశ ప్రజా సంగ్రామ యాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే. గద్వాల్ జిల్లాలోని అలంపూర్లోని జోగులాంబ దేవి ఆలయంలో ప్రార్థనలు చేసిన తర్వాత తన పాదయాత్రను ప్రారంభించారు. ఉద్యోగాలు, సాగునీరు, రైతులకు రుణ మాపీ, పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు వంటి హామీలను టీఆర్ఎస్ సర్కార్ నెరవేర్చలేదని బండి సంజయ్ ఆరోపించారు. ప్రజల కోసం పోరాడేందుకు కుమార్ తన పాదయాత్రను చేపట్టారని వారు తెలిపారు.
ఇక, బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర నేటితో 21వ రోజుకు చేరింది. నేడు మన్యంకొండ అలివేలు మంగ ఆలయంలో బండి సంజయ్ ప్రత్యేక పూజలు చేశారు. నేడు బండి సంజయ్ పాదయాత్ర మహబూబ్ నగర్ గ్రామీణ మండల్లాలో కొనసాగుతుంది. రేపు జరిగే సభలో జేపీ నడ్డా పాల్గొననున్న నేపథ్యంలో.. తెలంగాణలో పార్టీకి మరింత ఊపు వస్తుందని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర మే 14వ తేదీన ముగియనుంది. ఈ సందర్భంగా నిర్వహించే బహిరంగ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు.
