రిపబ్లిక్ డే వేడుకల విషయమై  తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై  బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ స్పందించారు.  రిపబ్లిక్ డే వేడుకలను రాజ్ భవన్ కు పరిమితం  చేసి కేసీఆర్ పైశాచిక ఆనందం పొందారన్నారు.

హైదరాబాద్: రిపబ్లిక్ డే వేడుకలపై తెలంగాణ హైకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నామని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ చెప్పారు.బుధవారం నాడు సాయంత్రం బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను రాష్ట్రప్రభుత్వం అవమానిస్తుందన్నారు. రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణ విషయమై కోర్టుకు వెళ్లాల్సిన ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని ఆయన చెప్పారు.రిపబ్లిక్ డే వేడుకలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కేసీఆర్ సర్కార్ కు చెంపపెట్టు అని ఆయన అభిప్రాయపడ్డారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

రిపబ్లిక్ డే ఉత్సవాలను దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఘనంగా నిర్వహించుకుంటుంటే తెలంగాణలో మాత్రం ఈ వేడుకల విషయంలో నిర్లక్ష్య ధోరణిని ప్రభుత్వం అనుసరిస్తుందన్నారు. రిపబ్లిక్ డే వేడుకలను రాజ్ భవన్ కే పరిమితం చేయడం ద్వారా ఏం సాధించారని లక్ష్మణ్ ప్రశ్నించారు. రిపబ్లిక్ డే వేడుకలను నిలిపివేసి పైశాచిక ఆనందం తప్ప ఏం సాధించారని ఆయన ప్రశ్నించారు. 

కేసీఆర్ కు మంచి బుద్ది రావాలని దేవుడిని కోరుకుంటున్నట్టుగా లక్ష్మణ్ చెప్పారు. దేశం గురించి మాట్లాడుతున్న కేసీఆర్ తన రాష్ట్రంలో మాత్రం రాజ్యాంగాన్ని పాటించడం లేదన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చేస్తానని కూడా కేసీఆర్ గతంలో వ్యాఖ్యలు చేశాడన్నారు. కేసీఆర్ కుహనా మేథావి అని ఆయన విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఓటమే లక్ష్యంగా పని చేయాలని మహబూబ్ నగర్ లో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని లక్ష్మణ్ చెప్పారు.

also read:గణతంత్ర వేడుకలు: కెసిఆర్ కు హైకోర్టు షాక్, తమిళిసైకి ఊరట
గవర్నర్ వ్యవస్థను కించపర్చేటా బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రభుత్వం తీసుకున్నప్పుడు గుడ్డిగా ఆమోదించేందుకు రాజ్యాంగం అనుమతించలేదన్నారు. గవర్నర్ తనకున్న అధికారాల ద్వారా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను నిలిపివేసే అవకాశాన్ని రాజ్యాంగం కల్పించిందని ఆయన గుర్తు చేశారు. కనీస అవగాహన లేకుండా కొందరు మంత్రులు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.