మేమైతే కేసీఆర్ ను ఇప్పటికే బొక్కలో వేసేవాళ్లం..: బండి సంజయ్ సంచలనం
తెలంగాణలో గత పదేళ్లు కేసీఆర్ అధికారంలో వుండగా ఆయన అవినీతిపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ఇప్పుడెందుకు చర్యలు తీసుకోవడంలేదని బండి సంజయ్ ప్రశ్నించారు.
![BJP MP Bandi Sanjay serious comments on KCR and Congress Government AKP BJP MP Bandi Sanjay serious comments on KCR and Congress Government AKP](https://static-ai.asianetnews.com/images/01hjgeez7y78mbprpg4a0da9x9/bandi-sanjay--jpg_363x203xt.jpg)
కరీంనగర్ : తెలంగాణ అభివృద్ది కోసం మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ రక్తం ధారపోసారన్న కేటీఆర్ వ్యాఖ్యలపై బిజెపి ఎంపీ బండి సంజయ్ సెటైర్లు వేసారు. అసలు కేసీఆర్ ఒంట్లో రక్తం ఎక్కడిది? ఉన్నదంతా మందేగా? అంటూ ఎద్దేవా చేసారు. ప్రజల రక్తాన్ని పీల్చుకున్న రాబందు కేసీఆర్... ఆయన ఎప్పుడు రక్తం చిందించినట్లో అంటూ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం కోసం రక్తం చిందించింది బిజెపి కార్యకర్తలేనని అన్నారు. ప్రజల కోసం పోరాటాలు చేసిన బిజెపి కార్యకర్తలను బిఆర్ఎస్ నాయకులు ఇష్టం వచ్చినట్లు కొట్టించి రక్తం కళ్లజూసారని బండి సంజయ్ అన్నారు.
గత పదేళ్ళు రాష్ట్ర సంపదను, ప్రజాధనాన్ని దోచుకున్న విషయం కేటీఆర్ మరిచి మాట్లాడుతున్నాడని సంజయ్ అన్నారు. అదీ ఇదని కాదు... ప్రతీ దాంట్లో కేసీఆర్ కుటుంబం దోపిడీ వుందన్నారు. తెలంగాణలో బిజెపి అధికారంలోకి వచ్చివుంటే కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబ అవినీతిని బయటపెట్టేవాళ్లమని అన్నారు. తప్పకుండా కేసీఆర్ ను బొక్కలో వేసి వుండేవాళ్లమని సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసారు.
ప్రతిపక్షంలో వుండగా కేసీఆర్ అవినీతిపై ఆధారాలున్నాయని చెప్పిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబ అరాచకాలు, అవినీతి, అక్రమాలను ఇంకా ఎందుకు ఉపేక్షిస్తుందో అర్ధం కావడం లేదన్నారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ పై సీబీఐ విచారణను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కోరడంలేదని సంజయ్ ప్రశ్నించారు.
Also Read బిఆర్ఎస్ ను తిరిగి టిఆర్ఎస్ గా మార్చండి..: కేటీఆర్ తో కడియం ఆసక్తికర వ్యాఖ్యలు
గత బిఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పేరిట లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్ చెప్పిందని సంజయ్ గుర్తుచేసారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మొత్తం కాళేశ్వరం నిర్మాణంపై కాకుండా కేవలం మేడిగడ్డ బ్యారేజీపై జుడిషియల్ విచారణ జరపడం ఏమిటన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోరితే సీబీఐ విచారణ జరిపించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. కాబట్టి ఇప్పటికైనా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరాలని బండి సంజయ్ సూచించారు.