BJP MLA Raja Singh:  బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ షాక్ త‌గిలింది. మ‌త విశ్వాసాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ  కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.  

BJP MLA Raja Singh: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఎమ్మెల్యే పై కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మత విశ్వాసాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌పై కేసు నమోదైంది. 

ఒక వీడియో సందేశంలో అజ్మీర్ దర్గాపై విశ్వసనీయత కోల్పోయేలా రాజా సింగ్ కామెంట్లు చేశారంటూ  ఒక ప్రముఖ మత వ్యక్తిపై కించపరిచే, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు శాసనసభ్యుడిపై ఫిర్యాదు నమోదైంది. ఇందుకు సంబంధించిన వీడియోను సోష‌ల్ మీడియాలో చూసిన తర్వాత..మహమూద్ అలీ అనే వ్యక్తి పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఆ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు న్యాయ సలహా తీసుకున్న అనంతరం రాజా సింగ్పై ఐపిసి సెక్షన్ 295A కింద కేసు బుక్ చేయబడింది. 

మత విశ్వాసాలను కించపరిచేలా ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు అందడంతో.. న్యాయ సలహా తీసుకున్న అనంతరం అత‌నిపై కేసు బుక్ చేశామ‌ని, ఈ కేసులో విచారణ కొనసాగుతోంది’’ అని  సీఐ ఉమా మహేశ్వర్ తెలిపారు.

మ‌రోవైపు ..బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై హైదరాబాద్‌లోని అబిడ్స్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్‌లో సాముహిక అత్యాచారానికి గురైన బాలికకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు విడుదల చేశారనే ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 223(ఏ) కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసులుకు ఫిర్యాదు చేసిందేవరనే విషయం తెలియాల్సి ఉంది.  

అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీజేపీ కార్యాలయంలో ఇటీవల ప్రెస్ మీట్‌లో రఘునందన్ రావు మాట్లాడుతూ..  అమ్నేషియా పబ్ నుంచి బాలికను కొందరు వ్యక్తులు కారులో తీసుకెళ్లి సామూహిక అత్యాచారం జరిపిన ఘటనకు సంబంధించినవిగా చెబుతూ రఘునందన్ రావు ఇటీవల కొన్ని ఫొటోలు, వీడియోలు విడుదల చేశారు. ఆ ఫొటోల్లో ఉన్నది ఓ ఎమ్మెల్యే కొడుకు అని రఘునందన్ రావు ఆరోపించారు. అయితే ఫొటోలు, వీడియోలు విడుదల చేసినందుకు రఘునందన్ రావుపై సుమోటోగా కేసు నమోదు చేయాలని జూబ్లీహిల్స్ భావించారు. 

ఈ క్రమంలోనే పోలీసులు న్యాయ సలహా తీసుకున్నారు. ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసు నమోదు చేసే విషయంలో తొందరపడి చర్యలు తీసుకొవద్దని లాయర్లు వారిని చెప్పినట్టుగా సమాచారం. దీనికి సంబంధించి ఆయనకు నోటీసులు ఇవ్వనున్నారు పోలీసులు. బాధిత బాలిక ఫొటోలు, వీడియోలు బయటపెట్టడంపై వివరణ కోరనున్నట్లు తెలిసింది.