కేడర్ వివాదం.. డీజీపీని కూడా సోమేష్ లాగే ఏపీకి పంపాలి : బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు
12 మంది ఆలిండియా అధికారుల కేడర్ కేటాయింపుపై తెలంగాణ బీజేపీ నేత రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమేశ్ కుమార్ తరహాలో డీజీపీ అంజనీ కుమార్ను ఏపీకి పంపాలని ఆయన డిమాండ్ చేశారు.
బీజేపీ సీనియర్ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమేశ్ కుమార్ తరహాలో కొందరు అధికారులు సొంత కేడర్లో కాకుండా తెలంగాణలో కొనసాగుతున్నారని ఆయన మండిపడ్డారు. వీరిలో డీజీపీ అంజనీ కుమార్ కూడా వున్నారని.. ఆయనను కూడా ఏపీ కేడర్కు బదిలీ చేయాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఇప్పటికే తెలంగాణలో వున్న ఏడీ కేడర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై పీఎంవోకు ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు. అఖిల భారత సర్వీస్ అధికారులు ఎక్కడ పోస్టింగ్లు లభిస్తే అక్కడికి వెళ్లి విధులు నిర్వర్తించాల్సి వుంటుందని, సుప్రీంకోర్ట్ మార్గదర్శకాలు కూడా ఇదే చెబుతున్నాయని రఘునందన్ రావు పేర్కొన్నారు. అయితే క్యాట్ నిర్ణయంతో 15 మందిని సొంత కేడర్కు వెళ్లకుండా అడ్డుకున్నారని.. ఇది సుప్రీంకోర్ట్ తీర్పుకు విరుద్ధమని ఆయన దుయ్యబట్టారు.
అంతకుముందు 12 మంది ఆలిండియా అధికారుల కేడర్ కేటాయింపుపై విచారణను శుక్రవారం తెలంగాణ హైకోర్టు ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసును రెగ్యులర్ ధర్మాసనం విచారిస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది. మరో వైపు వ్యక్తిగత వాదనలు విన్పిస్తామని పిటిషనర్ల తరపు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ 12 మంది ఆలిండియా సర్వీసెస్ అధికారుల కేడర్ కేటాయింపుపై కేంద్ర ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ALso REad: సోమేష్ కుమార్కు కేంద్రం షాక్.. తెలంగాణ నుంచి రిలీవ్, ఏపీకి వెళ్లిపోవాలని ఆదేశం
2014లో రాష్ట్ర విభజన సమయంలో తమ కేగడర్ కేటాయింపులను సవాల్ చేస్తూ 12 మంది ఆలిండియా సర్వీసెస్ అధికారులు తెలంగాణలో కొనసాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అలాటైన 12 మంది ఆలిండియా సర్వీసెస్ అధికారులు క్యాట్ ను ఆశ్రయించారు. దీంతో ఈ 12 మంది ఆలిండియా సర్వీసెస్ అధికారులకు అనుకూలంగా క్యాట్ తీర్పును ఇచ్చింది. క్యాట్ తీర్పు ఆధారంగా ఐపిఎస్ లు అంజనీ కుమార్,అభిలాష్ భిస్త్, సంతోష్ మెహ్రా, ఏవీ రంగనాధ్ లు.. ఐఎఎస్ అధికారులు వాణి ప్రసాద్, హరికిరణ్, వాకాటి కరుణ, రోనాల్డ్ రొస్, ,ఆనంతరాము, శ్రీజన,శివశంకర్, మల్లెల ప్రశాంతిలు తెలంగాణ రాష్ట్రంలోనే విధులు నిర్వహిస్తున్నారు