ఈ దఫా గజ్వేల్ ప్రజలు కేసీఆర్ కు ఓటు వేయకూడదని నిర్ణయించుకున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చెప్పారు.

హైదరాబాద్: గజ్వేల్ ప్రజలు ఈ దఫా ఓటేయరనే భయంతో కేసీఆర్ కామారెడ్డికి పారిపోయారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు.బుధవారంనాడు మెదక్ లో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. గజ్వేల్ ప్రజలకు కేసీఆర్ ఏనాడూ ముఖం చూపించలేదన్నారు. గజ్వేల్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను కేసీఆర్ లాక్కున్నారని ఆయన ఆరోపించారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని చేసిన వాగ్దానాన్ని కేసీఆర్ అమలు చేయలేదని కేసీఆర్ పై ఈటల రాజేందర్ విమర్శలు చేశారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

గజ్వేల్ లో అన్ రెస్టు ఉందని ఈటల రాజేందర్ చెప్పారు.కెసిఆర్ ను ఎట్టిపరిస్థితుల్లో గెలిపించవద్దని నిర్ణయించుకున్నారని రాజేందర్ చెప్పారు. అక్కడో ఇక్కడో ఎందుకు గజ్వేల్ లో పోటీ చేస్తా అని తాను ఛాలెంజ్ విసిరిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఏ సర్వే సంస్థ వెళ్ళినా ఈ సారి కెసిఆర్ కి ఓటు వేయబోమని చెబుతున్నారన్నారు.అన్నీ సీట్లు ఒకేసారి ప్రకటించడం కెసిఆర్ బలం కాదు బలహీనతగా ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

తమ పార్టీ ఎమ్మెల్యేలు లంచాలు తీసుకుంటున్నారని కెసిఆర్ వ్యాఖ్యలను ఈటల రాజేందర్ ప్రస్తావిస్తూ 40 శాతం ఎమ్మెల్యేలను మారిస్తే వేరే పార్టీలకు వెళ్లే ప్రమాదం ఉందని సిట్టింగ్ లను మార్చలేదని రాజేందర్ అభిప్రాయపడ్డారు.

నోరు కట్టుకుని ప్రభుత్వం నడుపుతున్నామని చెబుతున్న కేసీఆర్ కు అతి తక్కువ కాలంలోనే వేల కోట్లు ఎలా సంపాదించారని ఆయన ప్రశ్నించారు.డబుల్ బెడ్ రూం ఇళ్లు,నిరుద్యోగ భృతి,రుణమాఫీ పూర్తి చేయలేదని ఆయన విమర్శించారు. జీతాలు సరిగ్గా ఇవ్వలేక పోతున్న కేసీఆర్ సర్కార్ ప్రజలకు ఇచ్చిన హామీలను ఎలా అమలు చేస్తుందని ఆయన ప్రశ్నించారు.

కాంగ్రెస్ , బీఆర్ఎస్ కు ఓటు వేస్తే గెలిచేది కెసిఆరేనన్నారు. కాంగ్రెస్ లో గెలిచిన వారంతా కెసిఆర్ పంచన చేరుతారని ఈటల రాజేందర్ ఆరోపించారు. గతంలో జరిగిన ఘటనలను ఆయన గుర్తు చేశారు. బీఆర్ఎస్ కు ఓటు వేస్తే ఒక కుటుంబం బాగుపడుతుందన్నారు. కుటుంబాలు బాగుపడాలి అంటే బీజేపీకి ఓటేస్తే కుటుంబాలు బాగుపడుతాయని ఈటల రాజేందర్ చెప్పారు.