పొంగులేటి , జూపల్లిలతో భేటీ.. అధిష్టానం ఆదేశాలతోనే వెళ్లా : బీజేపీలో లుకలుకలకు ఈటల చెక్
అధిష్టానం ఆదేశాలతోనే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులను కలిశామన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. బీజేపీలో చేరాలని వారిని కోరినట్లు ఈటల పేర్కొన్నారు.
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులతో బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావులు భేటీ కావడం తెలంగాణ బీజేపీలో కలకలం రేపిన సంగలి తెలిసిందే . ఈ విషయం కొందరు నాయకులకు ముందే తెలిస్తే.. మరికొందరికి ఎలాంటి సమాచారం లేదు. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ స్పందించారు. అధిష్టానం ఆదేశాలతోనే వీరిని కలిశామని.. కేసీఆర్ నిరంకుశ పాలనను బొంద పెట్టే పార్టీ బీజేపీ మాత్రమేనని ఈటల పేర్కొన్నారు.
బీజేపీలో చేరాలని వారిని కోరినట్లు ఈటల స్పష్టం చేశారు. పొంగులేటి, జూపల్లితో పాటు తమ అందరి లక్ష్యం కేసీఆర్ను ఓడించడమేనని వారు తెలిపారు. బీజేపీలో చేరాలని వారిని కోరినట్లు ఈటల పేర్కొన్నారు. కేసీఆర్ డబ్బు సంచులతో కొనే ప్రయత్నం చేస్తున్నారని.. కానీ అవి చెల్లవని రాజేందర్ స్పష్టం చేశారు. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కుటుంబ పాలనను అంతమొందించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చినట్లు ఈటల గుర్తుచేశారు.
ALso Read: నాకు చెప్పకపోవడం తప్పేమీ కాదు.. : పొంగులేటితో బీజేపీ నేతల భేటీపై బండి సంజయ్
మరోవైపు.. బీజేపీలో చేరే విషయమై మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు స్పష్టత ఇవ్వలేదు. తమ అనుచరులతో చర్చించిన తర్వాత స్పష్టత ఇస్తామని ఈ ఇద్దరు నేతలు బీజేపీ బృందానికి చెప్పారని సమాచారం. అందరం కలిసి పోరాటం చేస్తే బీఆర్ఎస్ ను అధికారం నుండి తప్పించవచ్చని ఈటల రాజేందర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులకు చెప్పారు. అయితే పార్టీలో చేరే విషయమై ఇప్పటికిప్పుడు హామీ ఇవ్వలేమని ఈ ఇద్దరు నేతలు చెప్పారని సమాచారం.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏ పార్టీలో చేరే విషయమై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాదయాత్రకు కూడా సన్నాహలు చేసుకుంటున్నారు. గత నెల 10వ తేదీన బీఆర్ఎస్ నుండి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు సస్పెన్షన్ కు గురయ్యారు. దీంతో ఈ ఇద్దరు నేతలకు కాంగ్రెస్, బీజేపీ నేతలు గాలం వేస్తున్నారు. కానీ ఈ ఇద్దరు నేతలు ఏ పార్టీలో చేరుతారన్న విషయమై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్ నేతలు కూడా ఈ ఇద్దరితో చర్చించే అవకాశాలు కూడా లేకపోలేదు.