జీవో నెం 317.. ఉద్యోగులంటే లెక్కలేదు.. అతని ఆత్మహత్యకు కేసీఆర్ సర్కారే కారణం: ఈటల ఫైర్
కేసీఆర్ (kcr) ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు మాజీ మంత్రి , బీజేపీ (bjp) ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (etela rajender). ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు . ఉద్యోగుల బదిలీలు అంటూ 317 జీవోను (go no 317) తీసుకువచ్చి ఉద్యోగులను ఆత్మహత్యలు చేసుకునేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఈటల దుయ్యబట్టారు.
కేసీఆర్ (kcr) ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు మాజీ మంత్రి , బీజేపీ (bjp) ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (etela rajender) . శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు . ఉద్యోగుల బదిలీలు అంటూ 317 జీవోను (go no 317) తీసుకువచ్చి ఉద్యోగులను ఆత్మహత్యలు చేసుకునేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఈటల దుయ్యబట్టారు. ఉద్యోగులతో చర్చించకుండా కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నెటివిటీ లేక ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు అని పార్టీల నాయకులు చెప్పిన వినకుండా ముఖ్యమంత్రి మొండి వైఖరి అవలంభిస్తున్నారని మండిపడ్డారు. ఈ జీవోతో ఉద్యోగులు ఇబ్బందులకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. నర్సంపేట వాసి ఉప్పుల రమేష్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం టీఆర్ఎస్ ప్రభుత్వమేనని రాజేందర్ ఆరోపించారు. దేశంలో ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటన ఎక్కడ లేదన్నారు ఈటల.
ఉద్యోగుల సంఘాలతో చర్చించి వెంటనే ఈ జీవోను రద్దు పరిచి వారికి న్యాయం చేయాలి రాజేందర్ డిమాండ్ చేశారు. ఉప్పుల రమేష్ కుటుంబానికి బీజేపీ పార్టి అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఆయన కుటుంబానికి ఆర్దిక సహాయంగా రూ. 50 వేలు అందించారు ఈటల రాజేందర్. ఉద్యోగుల ఇబ్బందులు పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.
కాగా.. గణతంత్ర దినోత్సవం (Republic Day) రోజున కేసీఆర్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని ఈటల రాజేందర్ విమర్శించారు. సీఎం కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే రాజ్భవన్లో జరిగిన గణతంత్ర వేడుకులకు హాజరు కాలేదని ఆరోపించారు. బుధవారం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. రాజ్భవన్లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనకుండా కేసీఆర్ రాజ్యాంగం, సంప్రదాయాలను తుంగలో తొక్కారని విమర్శించారు. ఇది ముమ్మాటికీ రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని అన్నారు. రాజ్భవన్లో జరిగిన రిపబ్లిక్ వేడుకల్లో కనీసం సీనియర్ మంత్రి కూడా లేకపోవడం మంచి సంప్రదాయం కాదన్నారు. ఇది ఫెడరల్ స్ఫూర్తికే విఘాతం అని ఈటల అభిప్రాయపడ్డారు.
గవర్నర్ ఎవరైనా ఉండొచ్చు.. కానీ గవర్నర్ కుర్చీకి గౌరవం ఇవ్వాలని ఈటల అన్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్ కుర్చీకే మచ్చ తెచ్చే విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. స్పీకర్ హోదాలో మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. బీజేపీ నేతలపై టీఆర్ఎస్ శ్రేణులు అసహనంతోనే దాడులు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాప్రతినిధులకే రక్షణ లేకుంటే ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.