నాగార్జునసాగర్లో డిపాజిట్ కోల్పోయిన బీజేపీ: కానీ, ఊరటనిచ్చే అంశమిదీ....
నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ డిపాజిట్ కోల్పోయింది. అయితే గతంతో పోలిస్తే ఎక్కువ ఓట్లు దక్కించుకోవడం ఆ పార్టీకి ఊరటనిస్తోంది.
నల్గొండ: నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ డిపాజిట్ కోల్పోయింది. అయితే గతంతో పోలిస్తే ఎక్కువ ఓట్లు దక్కించుకోవడం ఆ పార్టీకి ఊరటనిస్తోంది. నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం నుండి బీజేపీ డాక్టర్ రవికుమార్ ను బరిలోకి దింపింది. గిరిజనులకు ఈ నియోజకవర్గంలో గణనీయంగా ఓట్లున్నాయి. దీంతో గిరిజన సామాజికవర్గానికి చెందిన డాక్టర్ రవికుమార్ నాయక్ కు బీజేపీ సీటిచ్చింది. ఈ నియోజకవర్గంలో గిరిజనులకు సుమారు 30 నుండి 40 వేల ఓట్లుంటాయి. కానీ ఈ నియోజకవర్గంలో బీజేపీకి మాత్రం డిపాజిట్ దక్కలేదు. టీఆర్ఎస్ అభ్యర్ధికి కాంగ్రెస్ గట్టిపోటి ఇచ్చింది. జానారెడ్డి కాకుండా మరో అభ్యర్ధిని బరిలోకి దింపితే ఫలితం మరోలా ఉండేదనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.
also read:జానారెడ్డి : మూడు దఫాలు ఆ సామాజికవర్గం చేతిలో ఓటమి
ఈ స్థానంలో బీజేపీ అభ్యర్ధి డాక్టర్ రవికుమార్ కు 7,159 ఓట్లు దక్కాయి. అయితే గత ఎన్నికల సమయంలో బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసిన కంకణాల నివేదిత రెడ్డికి 2675 ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల కంటే ఓట్లను పెంచుకొంది. అయితే కాంగ్రెస్ ను వెనక్కి నెట్టి తామే టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయమని ప్రచారం చేసుకొంటున్న బీజేపీకి ఈ ఎన్నికల ఫలితాలు మాత్రం రుచించడం లేదు.దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించడం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మెరుగైన సీట్లను గెలుచుకోవడంతో బీజేపీ రాజకీయంగా కాంగ్రెస్ పై పైచేయి సాధించినట్టుగా కన్పించింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో , నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైంది. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో ఓటమిపాలైనా కూడ టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని కాంగ్రెస్ చెప్పుకొనే వీలు ఏర్పడింది. ఆ దిశగా ఆ పార్టీ ఓట్లు సాధించింది.