విశాఖ ఉక్కు ఉద్యమానికి కేటీఆర్ మద్దతు: ఆ హామీలేమయ్యాయి, విజయశాంతి సెటైర్లు
తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్ కుటుంబం ఎలాంటి హామీలిచ్చిందో ఒకసారి గుర్తు చేసుకుంటే మంచిదని బీజేపీ నేత, సినీ నటి విజయశాంతి హితవు పలికారు.
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్ కుటుంబం ఎలాంటి హామీలిచ్చిందో ఒకసారి గుర్తు చేసుకుంటే మంచిదని బీజేపీ నేత, సినీ నటి విజయశాంతి హితవు పలికారు.
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశంపై మంత్రి కేటీఆర్ స్పందనపై బీజేపీ నాయకురాలు విజయశాంతి ఫేస్బుక్లో స్పందించారు. సామెతను ఉదాహరణగా తీసుకుని కేటీఆర్పై సెటైర్ వేశారు. అమ్మకు అన్నం పెట్టనోడు... పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తున్నాడంటూ కేటీఆర్పై వ్యంగాస్త్రం సంధించారు.
‘‘అమ్మకు అన్నం పెట్టనోడు... పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడని... తెలంగాణలో తరచుగా వినిపించే సామెతను ఆమె గుర్తు చేశారు. సరిగ్గా టీఆర్ఎస్ నేతలు కూడా అదే బాటలో పయనిస్తున్నారని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతోందన్నారు.
ఉమ్మడి రాష్ట్ర పాలకుల హయాంలో మూతపడిన తెలంగాణలోని నిజాం షుగర్స్, ఆజంజాహి మిల్స్, ఆల్విన్ కంపెనీ, ప్రాగా టూల్స్ లాంటి పలు కంపెనీలను వంద రోజుల్లో తెరిపించి ఉద్యోగాలు కల్పిస్తామని హామీలిచ్చారని ఆమె గుర్తు చేశారు.
ఇప్పుడు మాటమాత్రంగానైనా వాటి ప్రస్తావన చేయడం లేదని ఆమె విమర్శించారు. ఇంతకీ ఇదంతా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓట్ల కోసమేనని ఆమె అనుమానాన్ని వ్యక్తం చేశారు.
ఈ దొర కుటుంబపు అసలు ధోరణి ఆంధ్ర ప్రాంత ప్రజలపై ఎంత అసభ్యకరంగా... అవమానించే ధోరణిలో... బూతు మాటలతో కూడి ఉంటుందో ఒక్కసారి గతం గుర్తు చేసుకోవాలని ఆమె కోరారు.