రూ.70 కోట్ల భూమి.. టీఆర్ఎస్ కోసం రూ.4.93 లక్షలకే , ఇంత అధికార దుర్వినియోగమా : విజయశాంతి
హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి భూ కేటాయింపు వ్యవహారం వివాదానికి దారి తీసింది. దాదాపు 70 కోట్ల విలువ చేసే భూమిని కేవలం 4.93 లక్షలకే కేటాయించడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నేత విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రభుత్వంపై (telangana govt) బీజేపీ (bjp) నాయకురాలు విజయశాంతి (vijayasanthi) తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అధికార పార్టీ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోందని... టీఆర్ఎస్ (trs) పార్టీ కార్యాలయం కోసం కారుచౌకగా భూమిని కేటాయించారని ఆమె ఆరోపించారు. పార్టీ హైదరాబాద్ జిల్లా కార్యాలయానికి ప్రభుత్వం రూ.70 కోట్ల విలువైన భూమిని కేటాయించిందని.. టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్, ఎంపీ కె.కేశవరావు ఇంటి పక్కనే ఈ స్థలం ఉందని విజయశాంతి అన్నారు. దీన్ని కేటాయించాలని టీఆర్ఎస్ విజ్ఞప్తి చేయగానే... సచివాలయం నుంచి వచ్చిన ఆదేశాలతో ఈ నెల 9న జిల్లా కలెక్టర్ శర్మన్ ప్రతిపాదనలు పంపారని రాములమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ మరుసటి రోజే భూపరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయం... భూమి కేటాయింపుపై సిఫారసు చేస్తూ ప్రభుత్వానికి ఫైలును పంపించిందని చెప్పారు. ఆ తర్వాత రోజు అంటే, మే 11న రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆగమేఘాల మీద భూమిని కేటాయిస్తూ జీవో నం.47ను జారీ చేశారని విజయశాంతి దుయ్యబట్టారు. ఎన్బీటీ నగర్లో గజం రూ.లక్షన్నర ధర పలుకుతోందని.. అంటే ఈ భూమి విలువ రూ.70 కోట్లపైనే అని చెప్పారు. కానీ, 2018 ఆగస్టు 16న ప్రభుత్వం విడుదల చేసిన పాలసీ ప్రకారం గజం రూ.100 చొప్పున టీఆర్ఎస్ పార్టీ ఈ స్థలానికి రూ.4.93 లక్షలు చెల్లిస్తే సరిపోతుందని విజయశాంతి ఫైరయ్యారు.
ALso Read:ఎవని పాలయిందిరో తెలంగాణ...: టీఆర్ఎస్ కు ఖరీదైన ప్రభుత్వ స్థలం కేటాయింపుపై రేవంత్ సీరియస్
కేసీఆర్ సర్కార్ (kcr govt) అధికార దుర్వినియోగానికి ఇదొక మచ్చు తునక మాత్రమేనని.. ఇలాంటివి రాష్ట్రవ్యాప్తంగా కోకొల్లలుగా జరుగుతూనే ఉన్నాయని రాములమ్మ ఆరోపించారు. కేసీఆర్ ఆటలు ఇక ఎంతో కాలం సాగవని.. ప్రజలు అన్నీ చూస్తునే ఉన్నారని, తగిన బుద్ధి చెప్పే రోజు తొందర్లోనే రానుంది'' అని విజయశాంతి జోస్యం చెప్పారు.