తిరిగి కాంగ్రెస్ గూటికి చేరనున్నాడంటూ జరుగుతున్న ప్రచారంపై బిజెపి నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. 

సూర్యాపేట : కర్ణాటక ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్ తో తెలంగాణ కాంగ్రెస్ లోకి వలసలు పెరిగిపోతాయని రాజకీయ ప్రచారం జోరందుకుంది. ఇటీవలే ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసి బిజెపిలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా సొంత గూటికి చేరేందుకు సిద్దమయ్యారంటూ ప్రచారం సాగుతోంది. ఈ సోషల్ మీడియా ప్రచారంపై తాజాగా కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. 

తాను బిజెపిని వీడనున్నట్లు జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమని... ఆ పార్టీతోనే ప్రయాణం సాగిస్తానని కోమటిరెడ్డి స్పష్టం చేసారు. కావాలనే తప్పడు వార్తలు ప్రచారం చేసి క్యాడర్ ను గందరగోళానికి గురిచేసే కుట్రలు చేస్తున్నారని అన్నారు. తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని బిజెపి శ్రేణులకు సూచించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ మునుగోడు నియోజకవర్గ బిజెపి అభ్యర్థిగా తానే బరిలోకి దిగనున్నట్లు కోమటరెడ్డి స్పష్టం చేసారు. 

తెలంగాణ పాలిటిక్స్ పై కర్ణాటక రిజల్ట్ ఎఫెక్ట్ : 

తెలంగాణకు పొరుగునే వున్న కర్ణాటకలో అధికార బిజెపిని కాదని కాంగ్రెస్ పార్టీకి పట్టంకట్టారు ప్రజలు.136 సీట్లతో సంపూర్ణ మెజారిటీ సాధించిన కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టేందుకు సిద్దమవుతోంది. ఇలా కన్నడ ప్రజలు ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్ లో మరింత జోష్ పెరిగింది.ఇది కర్ణాటకలోనే కాదు తెలంగాణ రాజకీయాలపైనా ఎఫెక్ట్ చూపిస్తోంది. కర్ణాటకలో మాదిరిగానే తెలంగాణలోనూ కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టడం ఖాయమని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా నాయకులు చేరతారని ప్రచారం జరుగుతోంది. ఇంతకాలం ఏ పార్టీలో చేరాలన్న డైలమాలో వున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కర్ణాటక రిజల్ట్ తర్వాత కాంగ్రెస్ లో చేరడానికి సిద్దమయ్యారంటూ ప్రచారం జరుగుతోంది. ఇదే క్రమంలో కాంగ్రెస్ ను వీడిన నాయకులు కూడా సొంతగూటికి చేరాలని ప్రయత్నిస్తున్పట్లుగా ప్రచారం జరుగుతోంది. బిజెపిలో అంత కంఫర్ట్ గా లేని కోమటిరెడ్డి కూడా తిరిగి కాంగ్రెస్ గూటికి చేరనున్నట్లు సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. దీన్ని తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఖండించారు.

ఇక ఆదిలాబాద్ బిజెపి ఎంపీ సోయం బాపూరావు కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇలా తాను పార్టీ మారనున్నట్లు జరుగుతున్న ప్రచారంపై బాపూరావు స్పందించారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని తాను కలిసిన మాట నిజమేనని... కానీ రాజకీయాల కోసం ఆయనను కలవలేదని అన్నారు. కేవలం తన కొడుకు పెళ్లికి ఆహ్వానించేందుకే ఆయనను కలిసానని అన్నారు. 

కేవలం రేవంత్ రెడ్డినే కాదు ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా కలవనున్నట్లు బాపూరావు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా తన కొడుకు పెళ్లికి అందరినీ ఆహ్వానిస్తున్నానని అన్నారు. దీన్ని కూడా రాజకీయం చేయడం తగదని బిజెపి ఎంపీ బాపూరావు అన్నారు.