అది నీవల్ల కాదు... నీ జేజమ్మ వల్ల కూడా కాదు..: కేసీఆర్ కు ఈటల స్ట్రాంగ్ వార్నింగ్
ప్రజా దీవెన యాత్ర పేరిట సాగుతున్న ఈటల పాదయాత్ర ఇళ్ళంతకుంట మండలం రాచపల్లికి చేరుకుంది. ఈ సందర్భంగా గ్రామస్తులు ఈటలకు ఘన స్వాగతం పలికారు.
హుజురాబాద్: దేశంలో కాదు ప్రపంచంలోనే మనిషికి వెలగడుతున్న ఏకైక నాయకుడు కేసిఆరే అని మాజీ మంత్రి, బిజెపి నాయకులు ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఆయన కేవలం డబ్బుని, అధికార అహంకారాన్ని మాత్రమే నమ్ముకున్నాడని పేర్కొన్నారు. హుజురాబాద్ నాయకులను బస్సు ఎక్కించి సిద్దిపేట తీసుకుపోయి వెల కట్టి పంపిస్తున్నారని ఈటల ఆరోపించారు.
ప్రజా దీవెన యాత్ర పేరిట సాగుతున్న ఈటల పాదయాత్ర ఇళ్ళంతకుంట మండలం రాచపల్లికి చేరుకుంది. ఈ సందర్భంగా గ్రామస్తులు ఈటలకు ఘన స్వాగతం పలికారు. ఊరంతా కలియతిరుగుతూ ప్రతి ఒక్కరినీ పలకరించారు.
ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ... 19 ఏళ్లుగా నేను కాకుండా మీ కష్టాలను తీర్చడానికి ఇంకా ఎవరన్నా వచ్చారా? అని ప్రశ్నించారు. గతంలోనే కాదు ఇప్పటికీ, ఎప్పటికీ మీకు అండగా ఉంటానని ఈటల భరోసా ఇచ్చారు.
''ఈటల సాయం చేశాడు తప్ప... ఎవరి దగ్గర చెయ్యి చాప లేదు. నీ ఫోటో గోడల మీద ఉంటే నా ఫోటో ప్రజల గుండెల్లో ఉంది. దాన్ని చెరపడం నీ జేజెమ్మ వల్ల కూడా కాదు. బానిసగా బ్రతకను అని బావుటా ఎగరవేసాను. అండగా నిలవండి. ఒక్కో ఓటు చాలా ముఖ్యం. ఈ ఊర్లో ఉన్న యువత అంతా ఒక సైన్యంలా పనిచేయండి. 2023 లో అధికారం మనదే'' అని ఈటల స్ఫష్టం చేశారు.
read more ఆ బిడ్డల శవాలను భుజాలపై మోశా... కాబట్టే టీఆర్ఎస్ జెండాకు ఓనర్ అన్నా: ఈటల రాజేందర్
''మూడేళ్లుగా ప్రజలు అడిగితే పెన్షన్ ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్రాన్ని నెట్టాడు కేసిఆర్. కానీ నేను రాజీనామా చేసిన తరువాత ముసలోల్లు, వితంతువు గుర్తు వచ్చారు. నేను రాజీనామా చేయడంతో ఇవన్నీ వస్తున్నాయి. రేషన్ కార్డులు వస్తున్నాయి. ఇవన్నీ కేవలం నన్ను ఓడించడానికి మాత్రమే ఇస్తున్నారు'' అన్నారు.
''ఒక్క హుజూరాబాద్ కి మాత్రమే 20 గొర్లు ఒక పొట్టేలు ఇస్తారట. దళితులకు కేవలం ఒక్క హుజూరాబాద్ లో మాత్రమే దళిత బంధు ఇస్తారట... ఇది సంతోషమే... కానీ రాష్ట్రం అంతా దళిత బంధు ఇవ్వాలి. దళిత పై ప్రేమతో రైతు బందు ఇస్తున్నారా? లేక ఓట్ల కోసమా?'' అని ఈటల ప్రశ్నించారు.
''కేసిఆర్ కి మనిషి కనబడడు... ఓటు మాత్రమే కనిపిస్తుంది. ఆయన కన్ను సీఎం కుర్చీ మీద ఉంటుంది తప్ప పేద ప్రజల మీద కాదు. ఉద్యోగాలు ఇవ్వరు. దూప అయినప్పుడు బాయి తవ్వుకున్నట్టు ఎన్నికలు రాగానే పథకాలు పెట్టాలి... ఓట్లు దండుకుని కండ్లళ్ళ మట్టి కొట్టాలి... ఇదే కేసిఆర్ నైజం. ఏకు మేకు అయ్యిండు అని నన్ను కతం పట్టించిండు. నా భూమిని అరగంటల కొలిసిండు, కేసు పెట్టిండు'' అంటూ కేసీఆర్ పై ఈటల మండిపడ్డారు.