Asianet News TeluguAsianet News Telugu

ఆ బిడ్డల శవాలను భుజాలపై మోశా... కాబట్టే టీఆర్ఎస్ జెండాకు ఓనర్ అన్నా: ఈటల రాజేందర్

హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో ప్రజా దీవెన పేరిట పాదయాత్ర చేస్తున్నారు బిజెపి నాయకులు ఈటల రాజేందర్. ఈ క్రమంలోనే వర్షంలో తడుస్తూనే పాదయాత్ర సాగిస్తున్నారు. 

Praja Deevena Yatra... Eataka Rajender fires on CM KCR akp
Author
Huzurabad, First Published Jul 23, 2021, 1:24 PM IST

కరీంనగర్: అమరుల త్యాగం వల్లే తెలంగాణ వచ్చింది తప్ప కేసీఆర్ ఒక్కడివల్లే రాలేదని మాజీ మంత్రి, బిజెపి నాయకులు ఈటల రాజేందర్ అన్నారు. 1200 మంది తెలంగాణ బిడ్డల ప్రాణత్యాగమే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిపెట్టింది. ఆ బిడ్డల శవాలు మోసిన బిడ్డగానే తాను టీఆర్ఎస్ జెండాకు ఓనర్ అని చెప్పానన్నారు. ఉద్యమకాలంలోనే కాదు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తాను కష్టపడితేనే కేసీఆర్ పదవులు ఇచ్చారు తప్ప ఊరికే ఇవ్వలేదన్నారు.  
 
జమ్మికుంట మండలంలో ఈటల రాజేందర్ ప్రజా ఆశీర్వాద పాదయాత్ర కొనసాగుతోంది. ఐదో రోజు పాదయాత్రలో భాగంగా ఇవాళ(శుక్రవారం) పాపక్కపల్లి గ్రామానికి చేరుకున్నారు ఈటల. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... నాలుగు రోజులుగా వర్షంలో తడిచి ముద్దవుతున్నా ఒక్క ఊరు కూడా వదిలిపెట్టకుండా పాదయాత్ర సాగుతోందన్నారు. ప్రజల దీవెనలు, కన్నీళ్ళ మధ్యే జైత్రయాత్ర కొనసాగుతుందన్నారు. ఈ పాదయాత్ర 25 రోజులు జరగబోతుందని... ప్రతి రోజు పాదయాత్రకు ఒక్కో జిల్లా నుండి నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరు అవుతామని ముందుకు వస్తున్నారన్నారు. 

''డబ్బుల కోసం, ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా పార్టీ మారిన వారి భవిష్యత్తు శూన్యం అవుతుంది. జెండా కట్టి పార్టీని కాపాడే వాడే కార్యకర్త. కెసిఆర్ పార్టీ పెట్టీ హైదరాబాద్ లో కూర్చుంటే అయ్యేదా? తెలంగాణ రాష్ట్రం కోసం పార్టీ ప్రజల గర్భంలో పుట్టింది తప్ప కెసిఆర్ కుటుంబం కోసం కాదు'' అని ఈటల అన్నారు. 

read more  నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు... వారే చేయించారు: ఈటల రాజేందర్ సంచలనం

''స్వరాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో వంటావార్పు, రైల్ రోకో చేశాం. యావత్ దేశం నివ్వెర పోయేలా ఉద్యమం చేశాం. ఇలా తమ అందరి వల్ల తెలంగాణ వచ్చింది తప్ప కేసిఆర్ ఒక్కడి వల్ల రాలేదు. నాకు బంగారు పళ్ళెంలో పెట్టీ అన్నీ ఇచ్చామంటున్నారు. కానీ నా కష్టానికి ప్రతిఫలంగానే పదవులు వచ్చాయి. నీ బిడ్డకు బీ ఫారం ఇచ్చావ్ కదా... గెలిచిందా? ఒళ్ళోంచి పనిచేస్తేనే ప్రజల ప్రేమతో గెలిపిస్తారు తప్ప ఎవరి ముఖం చూసి కాదు'' అన్నారు.  

''నా బొందుగ పిసికితే అయిపోతుంది అనుకున్నాడు కానీ నాకు ప్రజల అండ ఉంది. నాకు ఈ ప్రజలతో ఉంది కుటుంబ సంబంధం. కో అంటే కో అన్న వాడు ఈటల. నా దగ్గరికి వస్తే ఏ కులం, ఏ మతం, ఏ పార్టీ అడగ లేదు... కేవలం మీ కష్టం ఎంటి అని మాత్రమే అడిగా. తోచిన సాయం చేశా. ఇలా ప్రజాసేవ చేసి మీ ప్రేమను పొందాను'' అని ఈటల పేర్కొన్నారు.

''కానీ డబ్బులే నమ్ముకొని కేసిఆర్ వస్తున్నారు. ఎక్కడ పెన్షన్లు రావు కానీ ఇక్కడ 11 వేల మందికి పించన్లు వచ్చాయి.  రేషన్ కార్డ్ లు కూడా ఇస్తున్నారు. ప్రజలారా ఇవన్నీ నా వల్ల వచ్చాయి అని మర్చిపోకండి. దళిత సీఎం ఇవ్వలే, మూడు ఎకరాలు ఇవ్వలేదు, కానీ ఇప్పుడు దళిత బందు ఇస్తాడట... అది కూడా వారి మీద ప్రేమతో కాదు ఓట్ల కోసం ఇస్తాడట. ఏం చేసినా ఓట్ల కోసమేనట.  ప్రశ్నించడం తట్టుకోలేక మనమీద ఎన్నికలను రుద్దిండు కెసిఆర్. ఇక నడవవు నీ ఆటలు. తప్పదు నీకు పతనం. 2023 లో బీజేపీ దే అధికారం'' అంటూ కేసీఆర్ పై మండిపడ్డారు ఈటల.  

 

 

Follow Us:
Download App:
  • android
  • ios