Asianet News TeluguAsianet News Telugu

ప్ర‌జా వ్య‌తిరేక బీజేపీకి గుణ‌పాఠం చెప్పాలి.. కార్మికుల‌కు మంత్రి ఎర్ర‌బెల్లి దయాకర్ పిలుపు

Warangal: కౌలు రైతులకు భరోసా కల్పించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు కలెక్టర్లను కోరారు. ఇటీవ‌ల అకాల వ‌ర్షాల‌తో న‌ష్ట‌పోయిన రైతుల‌ను ఆదుకుంటామ‌ని హనుమకొండలో ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌పై సమీక్ష నిర్వహించిన అనంత‌రం తెలిపారు.
 

BJP is implementing anti-people policies, should be taught a lesson, says Telangana Minister Errabelli Dayakar Rao to workers RMA
Author
First Published May 2, 2023, 1:50 AM IST

Telangana Minister Errabelli Dayakar Rao: ఇటీవల కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానల కారణంగా జరిగిన పంట నష్టంపై సమగ్ర నివేదికను రూపొందించాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లపై ఉందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కౌలు రైతులకు భరోసా కల్పించాలని క‌లేక్ట‌ర్ల‌కు సూచించారు. ఇటీవ‌ల అకాల వ‌ర్షాల‌తో న‌ష్ట‌పోయిన రైతుల‌ను ఆదుకుంటామ‌ని హనుమకొండలో ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌పై సమీక్ష నిర్వహించిన అనంత‌రం తెలిపారు. రైతుల కోసం ముఖ్య‌మంత్రి కేసీఆర్ నాయ‌క‌త్వంలోని బీఆర్ఎస్ ప్ర‌భుత్వం అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ద‌ని తెలిపారు. 

రైతులకు త్వరగా పరిహారం అందేలా వీలైనంత త్వరగా పంట నష్టం నివేదికను సిద్ధం చేయాలని వరంగల్, హనుమకొండ కలెక్టర్లు పీ.ప్రవీణ, సిక్తా పట్నాయక్ ల‌ను మంత్రి ఎర్ర‌బెల్లి దయాక‌ర్ రావు  ఆదేశించారు. కౌలు రైతులకు కూడా ఈ విష‌యంలో భ‌రోసా కలిగించాలని అధికారులను ఆదేశించారు. అలాగే, ధాన్యం కొనుగోలును కేంద్రాల వ‌ద్ద వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. రైస్ మిల్లర్లతో సమావేశాలు నిర్వహించి తక్కువ కొలతలు లేకుండా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించేందుకు రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మొక్కజొన్నను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, దీనికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. 

బీజేపీ స‌ర్కారుకు గుణ‌పాఠం చెప్పాలి.. 

అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురుస్కరించుకుని తొర్రూరులో జరిగిన మే డే వేడుకల్లో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు.. బీజేపీ పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. బీజేపీ పాలనకు చరమగీతం పాడాలని కార్మికవర్గానికి పిలుపునిచ్చారు. ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి కార్మికవర్గం గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చడానికే బీజేపీ ఎక్కువ ఆసక్తి చూపుతోందని మంత్రి ఆరోపించారు. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించిందని, తద్వారా కష్టాల్లో ఉన్న వర్గాల ఉపాధిని దెబ్బతీస్తోందని ఆరోపించారు. ఇదే స‌మ‌యంలో మ‌రోవైపు కేసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ కార్మిక వర్గానికి ఎనలేని సేవ చేస్తోందని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు కూడా పెంచిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios