తెలంగాణలో బర్డ్ ప్లూ కలకలం... భారీగా నాటుకోళ్ళు మృతి
తెలంగాణలో బర్డ్ ప్లూ కలకలం మొదలయ్యింది. మంచిర్యాలలో ఓ రైతుకు చెందిన కోళ్లు భారీగా మృతి చెందడంతో ఇందుకు బర్డ్ ప్లూ కారణమన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మంచిర్యాల: వ్యాక్సిన్ రాకతో కరోనా మహమ్మారి నుండి ఇప్పుడిప్పుడే భయటపడుతున్న దేశంలో బర్డ్ ప్లూ కలకలం మొదలయ్యింది. ఇప్పటిక పలు రాష్ట్రాల్లో బర్డ్ ప్లూ వ్యాప్తిచెందింది. తాజాగా తెలంగాణలో కూడా బర్డ్ ప్లూ భయం మొదలయ్యింది.
మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలం కన్నెపల్లిలో ఓ రైతు పెంచుకుంటున్న నాటు కోళ్ల మృతి కలకలం రేపుతోంది. ఒకే రైతుకు చెందిన 420 కోళ్లు మృతి చెందింది. దేశవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ కలకలం కొనసాగుతున్న సమయంలో కోళ్ళు మృతిచెందడంతో మంచిర్యాలలో భయాందోళన మొదలయ్యింది. కోళ్లు చనిపోడానికి బర్డ్ ప్లూ కారణమై వుంటుందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో పశువైద్యులు అక్కడకు చేరుకుని శాంపిల్స్ సేకరించారు.
ఇటీవల నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో కూడా భారీగా కోళ్లు మృత్యువాతపడ్డాయి. యానంపల్లి గిరిజన తండాలోని ఓ పౌల్ట్రీఫామ్లో వేలాది కోళ్లు మృతి చెందడం జిల్లాలో భయాందోళనకు కారణమవుతోంది. రాంచందర్ అనే వ్యక్తి నిర్వహిస్తున్న పౌల్ట్రీఫామ్ లో గత బుధ, గురువారాల్లో రెండువేలకు పైగా కోళ్లు మృతిచెందాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బర్డ్ ప్లూ వ్యాప్తి చెందుతున్న సమయంలో ఇలా వేలాది కోళ్లు చనిపోవడం అనుమానాలకు తావిస్తోంది. బర్డ్ ప్లూ కారణంగానే కోళ్లు చనిపోయి వుంటాయన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.