బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గ్రాండ్ ఫినాలే నేపథ్యంలో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్, సీరియల్ యాక్టర్ అమర్ దీప్ అభిమానులు అన్నపూర్ణ స్టూడియో వద్ద ఓవరాక్షన్ చేసారు.  

హైదరాబాద్ : బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ముగిసింది. సామాన్యుడిగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ సెలబ్రిటీలను వెనక్కినెట్టి టైటిల్ విజేతగా నిలిచాడు. సీరియల్ నటుడు అమర్ దీప్ రన్నరప్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే సందర్భంగా హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో వద్ద ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది. హౌస్ లోంచి బయటకు వచ్చిన అమర్ దీప్ పై కొందరు దాడికి యత్నించారు. అతడి కారుపై దాడిచేసి అద్దాలు పగలగొట్టారు. ఊహించని పరిణామంతో అమర్ దీప్ తో పాటు కారులో వున్న అతడి తల్లి, భార్య భయభ్రాంతులకు గురయ్యారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అంతకుముందు బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే షూటింగ్ జరుగుతున్న అన్నపూర్ణ స్టూడియో వద్దకు పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ అభిమానులు భారీగా చేరుకున్నారు. ఇరువర్గాలు పోటాపోటీగా నినాదాలు చేస్తూ బాహాబాహీకి దిగారు. ప్రశాంత్ ను బిగ్ బాస్ విన్నర్ గా ప్రకటించగానే అతడి అభిమానులు సంబరాలు చేసుకోగా అమర్ దీప్ అభిమానులు అసహనానికి గురయ్యారు. ఈ క్రమంలోనే ఇరువురి అభిమానుల మధ్య వాగ్వాదం మొదలై గొడవకు దారితీసింది. దీంతో అన్నపూర్ణ స్టూడియో వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. 

ప్రశాంత్, అమర్ అభిమానులు పరస్పర దాడులతో ఆగిపోకుండా రోడ్డుపైకి చేరి హంగామా సృష్టించారు. అటువైపు వచ్చిన ఆర్టిసి బస్సుపై దాడికి దిగి అద్దాలు ధ్వంసం చేసారు. ఇలా అభిమానుల ఓవరాక్షన్ తో అన్నపూర్ణ స్టూడియో వద్దనుండి వెళుతున్న వాహనదారులు ఇబ్బందిపడ్డారు. 

Also Read `బిగ్‌ బాస్‌` షో కోసం పస్తులున్నా..విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌ ఎమోషనల్‌.. ప్రైజ్‌ మనీ మొత్తం రైతులకే ..

ఇలా అభిమానుల గొడవ కొనసాగుతుండగానే స్టూడియో లోంచి అమర్ దీప్ కారు బయటకు వచ్చింది. ఇది గమనించిన ప్రశాంత్ ఫ్యాన్స్ మరింత రెచ్చిపోయి ఆ కారును అడ్డుకుని దాడికి దిగారు. అద్దాలు పగలగొట్టి అమర్ దీప్ బయటకు రావాలంటూ పట్టుబట్టారు. ఇదే సమయంలో అక్కడికి చేరుకున్న పోలీసులు అమర్ ను అక్కడినుండి సురక్షితంగా పంపించారు. అలాగే ప్రశాంత్, అమర్ అభిమానులను అన్నపూర్ణ స్టూడియో వద్దనుంది చెదరగొట్టారు.