ఎన్నికలకు ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 35 మంది నేతలు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్నారు. వీరిలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు వున్నారు.
ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. కర్ణాటక ఎన్నికల్లో విజయం తర్వాత కాంగ్రెస్ పార్టీలో నూతనోత్తేజం నెలకొంది. నేతలు కూడా విభేదాలు మరిచిపోయి పనిచేస్తామని చెబుతుండటంతో కేడర్ కూడా సమరోత్సాహంతో పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు హస్తం గూటికి చేరుతూ వుండటంతో కాంగ్రెస్ మరింత బలంగా మారుతోంది.
మరోవైపు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్కు ఆ పార్టీ నేతలు షాకిచ్చారు. డజనకు పైగా మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆఫీస్ బేరర్లు సోమవారం కాంగ్రెస్లో చేరనున్నారు. ఈ ఏడాది చివరిలో జరగనున్న తెలంగాణ ఎన్నికలకు ముందు ఇది కీలక పరిణామంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో వీరంతా సమావేశమయ్యారు.
కాంగ్రెస్లో చేరుతున్న వారిలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యేలు పాణ్యం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, కోట రాంబాబు , బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నర్సారెడ్డి కుమారుడు రాకేష్రెడ్డి, గుర్నాథ రెడ్డి, కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, తాడిపర్తి సాయి చరణ్ రెడ్డి, మేఘా రెడ్డి తూడి, కూర అన్న కిష్టప్ప, ముద్దప్ప దేశ్ముఖ్, జూపల్లి అరుణ్, సూర్య ప్రతాప్ గౌడ్, కల్యాణ్ కుమార్ కొత్త, దండు నరసింహ, సానే కిచా రెడ్డి, గోపిశెట్టి శ్రీధర్, సేర్య, పాయం వెంకటేశ్వర్లు, మువ్వా విజయ బాబీ, తెల్లం వెంకట్రావు, పిడమర్తి రవి, జారే ఆదినారాయణ, బానోత్ విజయ, తుళ్లూరి బ్రహ్మయ్య, మద్దినేని స్వర్ణ కుమారి, డొర్రా రాజశేఖర్, కోటా రాంబాబు, వుక్కంటి గోపాల రావు, డాక్టర్ రాజా రమేశ్, అల్లూరి వెంకటేశ్వర రెడ్డి, హనుమండ్ల ఝాన్సీ రెడ్డి, రఘునాథ యాదవ్, రాఘవేంద్ర రెడ్డి, కొత్త మనోహర్ రెడ్డి, సుతగాని జైపాల్ వున్నారు. కాగా.. `పాట్నాలో జరిగిన విపక్షాల మెగా సమావేశానికి బీఆర్ఎస్ గైర్హాజరైన కొద్దిరోజులకే ఈ పార్టీ నేతలు కాంగ్రెస్లో చేరారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఇచ్చిన పిలుపు మేరకు ఆ సమావేశానికి దేశంలోని అన్ని ప్రధాని ప్రతిపక్ష పార్టీల నేతలు హాజరయ్యారు.
దేశం ముందున్న ప్రధాన సమస్యలపై పోరాటం జరగాలని కేటీఆర్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. దురదృష్టవశాత్తూ తాము అక్కడ ఫ్లాట్ను కోల్పోతున్నామని ఆయన పేర్కొన్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా వుందన్నారు. గణనీయమైన సంఖ్యలో సీట్లు గెలుపొందాలనే లక్ష్యంతో ప్రభావవంతంగా ప్రయత్నిస్తున్నామని కేటీఆర్ తెలిపారు.
