అఖిలప్రియ విషయంలో పోలీసులు అమానుషంగా వ్యవహరించారని ఆరోపించారు ఆమె సోదరి భూమా మౌనిక. గురువారం మీడియాతో మాట్లాడిన ఆమె.. గాంధీ ఆసుపత్రిలో కళ్లు తిరిగి పడిపోయినా ఎవరూ పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు
అఖిలప్రియ విషయంలో పోలీసులు అమానుషంగా వ్యవహరించారని ఆరోపించారు ఆమె సోదరి భూమా మౌనిక. గురువారం మీడియాతో మాట్లాడిన ఆమె.. గాంధీ ఆసుపత్రిలో కళ్లు తిరిగి పడిపోయినా ఎవరూ పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు.
అఖిలప్రియ వెంట వచ్చిన లేడీ కానిస్టేబుళ్లు కూడా స్పందించలేదని మౌనిక ఆరోపించారు. అక్క తలకి గతంలో దెబ్బ తగలడం వల్ల ఆమెకు అప్పుడప్పుడు ఫిట్స్ వస్తుంటాయని.. న్యూరో సర్జన్ అవసరం అని చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని మౌనిక వ్యాఖ్యానించారు.
పైగా ఫిట్గా వుంది తీసుకెళ్లండని పోలీసులు నిర్లక్ష్యంగా మాట్లాడారని ఆమె ఆరోపించారు. తాను పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగాల్సి వచ్చిందని మౌనిక చెప్పారు. చివరికి అందర్నీ బతిమాలి స్ట్రెచర్ మీద ఆసుపత్రిలోకి తీసుకెళ్లామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అఖిలప్రియ విషయంలో ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదని మౌనిక దుయ్యబట్టారు. అక్క అరెస్ట్ వెనుక రాజకీయ ఒత్తిళ్లు వుండొచ్చని.. అక్క ఎప్పుడూ ఎవర్నీ డబ్బులు డిమాండ్ చేయలేదని ఆమె స్పష్టం చేశారు.
రిమాండ్ రిపోర్ట్లో వున్నది కరెక్ట్ కాదని.. హైదరాబాద్లో మాకు సేఫ్టీ లేదని మౌనిక ఆరోపించారు. చివరికి మా తమ్ముడిని కూడా టార్గెట్ చేశారని.. నాన్న ఆకస్మాత్తుగా చనిపోవడంతో ఏ ఆస్తులు ఎక్కడున్నాయనేది తమకు తెలియదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read:జైల్లో డాక్టర్లుంటారు.. అఖిలప్రియకు హైకోర్టులో చుక్కెదురు
నాన్నకు చాలా మంది వ్యాపార భాగస్వాములు ఉన్నారని.. మా వాటాలకు సంబంధించి గతంలో తాము వాళ్లతో మాట్లాడామని మౌనిక గుర్తుచేశారు. అక్క కోసం, తమ్ముడి కోసం ఫైట్ చేయడానికి సిద్ధంగా వున్నానని ఆమె ప్రకటించారు.
కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయేమోనన్న మౌనిక.. ఇప్పుడు కొట్టుకునేంత సీన్ ఎవరికీ లేదన్నారు. ఎవరైనా పెద్ద మనుషులు మధ్యవర్తిత్వం వహిస్తే మాట్లాడేందుకు సిద్ధంగా వున్నామని మౌనిక స్పష్టం చేశారు. భార్గవ్ రామ్ ఎక్కడున్నారో తమకు తెలియదన్నారు.
