జీవో నెం.246ని రద్దు చేయకుంటే ఉద్యమమే : కేసీఆర్కు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అల్టీమేటం
కృష్ణా జలాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 246ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. నల్గొండ- మహబూబ్ నగర్ జిల్లాల మధ్య ప్రభుత్వం చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు.
కృష్ణా జలాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 246ను భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎనిమిదేళ్లుగా కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రైతాంగానికి అన్యాయం చేస్తోందన్నారు. ఈ జీవో వల్ల నల్గొండ జిల్లా ఏడారిగా మారుతుందని.. ఈ జిల్లాకు దక్కాల్సిన 45 టీఎంసీల నీటిని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కు కేటాయించడంపై కోమటిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. నల్గొండ- మహబూబ్ నగర్ జిల్లాల మధ్య ప్రభుత్వం చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. జీవో నెంబర్ 246ని రద్దు చేయకపోతే తాను దీక్షకు దిగుతానని వెంకట్ రెడ్డి హెచ్చరించారు. ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను తోడుకుపోతున్నా సీఎం పట్టించుకోవడం లేదని ఎంపీ మండిపడ్డారు. ఈ విషయంలో అవసరమైతే ముఖ్యమంత్రిని కలుస్తానని వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.
అంతకుముందు కొద్దిరోజుల క్రితం ఇదే విషయమై కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల ప్రజల మధ్య రక్తపాతం జరిగితే కేసీఆరే బాధ్యత వహించాలని ఆయన కోరారు. ఎఎస్ఎల్బీసీకి కేటాయించిన నీటిని రద్దు చేస్తూ ప్రభుత్వం జీవో తెచ్చిందన్నారు. ఎస్ఎల్ బీసీకి 45 టీఎంసీలు కేటాయించిన విషయాన్ని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గుర్తు చేశారు. ఎస్ ఎల్ బీసీకి కేటాయించిన 45 టీఎంసీల నీటిని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయించారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. గతంలో ఎస్ఎల్ బీసీకి కేటాయించిన 45 టీఎంసీలను యధావిధిగా ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్ఎల్ బీసీ నల్గొండ జిల్లాకు సాగు తాగు నీరు అందించే ప్రాజెక్టు అని ఆయన గుర్తు చేశారు.
ALso REad:నల్గొండ, పాలమూరు జిల్లాల మధ్య రక్తపాతం జరిగితే కేసీఆర్ దే బాధ్యత: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ఎస్ ఎల్ బీసీ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాలోన దేవరకొండ, మునుగోడు, నల్గొండ, నకిరేకల్ వంటి అసెంబ్లీ నియోజకవర్గాలకు సాగు, తాగు నీరు అందించేందుకు ఉద్దేశించిందని వెంకట్ రెడ్డి గుర్తు చేశారు. అయితే 45 టీఎంసీల నీటిని రద్దు చేయడంతో జిల్లాకు తీవ్ర నష్టం వాటిల్లనుందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. సీఎం కేసీఆర్ వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకోవాలని ఆయన కోరారు.