"ప్రశ్నిస్తే కేసులు.. నిలదీస్తే నిర్బంధం.." తెలంగాణ పాలనపై భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు
పాము పడగ నీడలో తెలంగాణ పాలన కొనసాగుతున్నదని, ప్రశ్నిస్తే కేసులు.. నిలదీస్తే నిర్బంధం.. అన్నట్టుగా పాలన సాగుతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు.
పాము పడగ నీడలో తెలంగాణ పాలన కొనసాగుతున్నదని, ప్రశ్నిస్తే కేసులు.. నిలదీస్తే నిర్బంధం.. అన్నట్టుగా పాలన సాగుతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా శుక్రవారం నాడు తిమ్మాజీపేటలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ నిరంకుశ పాలన సాగుతోందనీ, ప్రశ్నిస్తే కేసులు నిలదీస్తే నిర్బంధం చేస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ ప్రజలు అడుగడుగున భయం భయంగా గడుపుతున్నారని, కొట్లాడితే కొలువులు రావన్న భయంతో నిరుద్యోగులు, గట్టిగా అడిగే ధరణిలో భూమి మాయం అవుతుందని రైతులు, నిలదీస్తే.. పింఛన్లు బంద్ అవుతాయని పేదలు, రేషన్ కార్డులు ఇవ్వారని అనేక వర్గాలు బీఆర్ఎస్ నిరంకుశ పాలనలో భయం భయంగా గడుపుతున్నారని వ్యాఖ్యానించారు.
సమస్త తెలంగాణ ప్రజానీకం మరొకసారి ఏకం కావాలనీ, నిధులు, నీళ్ల కోసం నిలదించాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ల్యాండ్, స్యాండ్, మైన్స్, వైన్స్ దోపిడీపై ఉన్న శ్రద్ధ ప్రజలకు మేలు చేసే పరిస్థితిపై బీఆర్ఎస్ నాయకులకు లేదని, అసైన్డ్, మాన్యం భూములతో పాటు బొందల గడ్డ భూములను కూడా ఆ నాయకులు వదలట్లేదని భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీలకు భూములు పంచుతామని చెప్పి.. ఇప్పుడూ పేదల నుండే భూములు గుంజుకుంటున్నారని ఆరోపించారు.
తాను చేస్తున్న ప్రతి వ్యాఖ్య పైనా చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ ను గెలిపించి.. తెలంగాణ వాదాన్ని నిలబెట్టిన యూనివర్సిటీ విద్యార్థులను దూరంగా పెట్టారనీ, వారు కొలువులేక.. ఉపాధి లేక పిచ్చోళ్ళ లాగా తిరుగుతున్నారనీ, వారి స్థితిని చూసి.. వాళ్ళ తల్లిదండ్రుల గుండెలు పగిలిపోతున్నాయని ఆయన అన్నారు.
నాలుగు కోట్ల ప్రజలకు చెందాల్సిన సంపదను కేసీఆర్ అండ్ కో దోపిడీ చేస్తుందని ఆయన మండిపడ్డారు. నాలుగు కోట్ల ప్రజలు బాగుపడటానికి సోనియాగాంధీ తెలంగాణకు ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. నాలుగు నెలల్లో వచ్చే ఎన్నికల్లో ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకుంటేనే తెలంగాణ లక్ష్యాలు నెరవేరుతాయని పేర్కొన్నారు.