బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులు 24 గంటల దీక్షకు పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా ఆదివారం రాత్రంతా బయటే వుండి నిరసన తెలపనున్నారు. నిన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, అధికారులతో జరిపిన చర్చల్లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో విద్యార్ధులు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
సమస్యలు పరిష్కరించాలంటూ గత కొన్ని రోజులుగా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులు చేస్తోన్న ఆందోళన ఆదివారం కూడా కొనసాగింది. అయితే ప్రభుత్వం, అధికారులు దిగిరాకపోవడంతో తమ ఆందోళనను ఉద్ధృతం చేయాలని విద్యార్ధులు నిర్ణయించారు. దీనిలో భాగంగా 24 గంటల పాటు నిరసన దీక్షకు దిగాలని డిసైడ్ అయ్యారు. రాత్రంతా బయటే వుండి .. దీక్ష చేయాలని నిర్ణయించారు.
కాగా.. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులు ఆరు రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 16న ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ గా ప్రోఫెసర్ సతీష్ కుమార్ ను నియమించింది ప్రభుత్వం. తాము లేవనెత్తిన 12 డిమాండ్లపై ప్రభుత్వం స్పందించే వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్ధులు స్పష్టం చేస్తున్నారు. విద్యార్ధులకు మద్దతుగా పేరేంట్స్ కూడా బాసర ట్రిపుల్ ఐటీ ప్రధాన గేటు వద్ద నిరసనకు దిగారు. ఆందోళన చేసిన పేరేంట్స్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే తమ డిమాండ్లపై ప్రభుత్వం చులకనగా మాట్లాడడాన్ని విద్యార్ధులు తప్పు పట్టారు.
Also Read:ముట్టడికి ఏబీవీపీ యత్నం, అరెస్ట్: బాసర ట్రిపుల్ ఐటీ వద్ద ఉద్రిక్తత
మంత్రి సబితా ఇంద్రారెడ్డి తమ డిమాండ్లను సిల్లీ డిమాండ్లు అని పేర్కొన్నారని విద్యార్ధులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈ వ్యాఖ్యలపై విద్యార్ధుల తల్లిదండ్రులు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ కు వచ్చి చూస్తే తమ డిమాండ్లు న్యాయబద్దమైనవో కావో తెలుస్తుందన్నారు. చర్చలకు పిలిచి జిల్లా అధికారులు తమతో వ్యవహరించిన తీరు సరిగా లేదని విద్యార్ధులు చెబుతున్నారు.
విద్యార్ధులు ఆందోళనను విరమించాలని ప్రభుత్వం కోరుతుంది. తాము లేవనెత్తిన 12 డిమాండ్లను పరిష్కరిస్తేనే తాము ఆందోళనను విరమిస్తామని కూడా విద్యార్ధులు తేల్చి చెప్పారు. మరోవైపు విద్యార్ధుల ఆందోళన విషయమై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ స్పందించారు. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని కూడా కోరారు. అధికారుల దృష్టికి ఈ విషయాలను తీసుకెళ్లనున్నట్టుగా గవర్నర్ చెప్పారు. వర్షంలో కూడా విద్యార్ధులు ఆందోళన చేస్తున్న విషయమై గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఏ లక్ష్యసాధన కోసం ట్రిపుల్ ఐటీలో చేరారో ఆ లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలని ఆమె విద్యార్ధులకు సూచించారు. మీ పేరేంట్స్ కలలు, మీ లక్ష్యాలను నెరవేర్చుకోవాలని ఆమె విద్యార్ధులను కోరారు. అయితే శనివారం విద్యార్ధులతో జరిగిన చర్చలు సఫలమయ్యాయని మంత్రి Indrakaran Reddy ప్రకటించారు. కానీ చర్చలు సఫలం కాలేదని విద్యార్ధులు తేల్చి చెప్పారు. దీనిలో భాగంగా ఆదివారం ఉదయం నుండి ఆందోళన సాగిస్తున్నారు. అంతకుముందు బాసర ట్రిపుల్ ఐటీ ఏఓ ను ప్రభుత్వం విధుల నుండి తప్పించింది.
