బండి సంజయ్ కు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి- కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్
బండి సంజయ్ కుమార్కు గొప్ప నటుడని, ఆయనకు ఆస్కార్ ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. బీజేపీపై తీవ్రంగా మండిపడ్డారు.
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్కు గొప్ప నటుడని, ఆయనకు ఆస్కార్ ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ను జైళ్లో వేస్తామని పదే పదే చెప్పే బండి సంజయే చివరికి జైలుకు వెళ్లారని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ అరెస్టు విషయంలో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపించారు. ఈ డ్రామాలను తెలంగాణ ప్రజలు గమనించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు రైతుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని అన్నారు. వరి కొనుగోలు విషయంలో రెండు ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. సోషల్ మీడియా వచ్చిన తరువాత ప్రజలందరూ చైతన్యవంతులు అయ్యారని అన్నారు.
రైతుల సమస్యలను పక్కదారి పట్టించడానికే బండి సంజయ్ కుమార్ జీవో 317పై బండి సంజయ్ కుమార్ ఆందోళన చేశారని ఆరోపించారు. నటనలో నరేంద్ర మోడీ, కేసీఆర్, అరవింద్ వంటి వారు ఎంత ముందంజలో ఉన్నా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడికే అవార్డు ఇవ్వాలని కరీంగనర్ లోక్ సభ నియోజకవర్గం తరఫున కోరుతున్నామని అన్నారు. కరీంనగర్ కు మూడు సంవత్సరాలుగా ఎంపీగా ఉన్న బండి సంజయ్ కుమార్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఒక మంత్రి వక్ఫ్ బోర్డు స్థలాన్ని ఆక్రమించుకున్నారని, వక్ప్ బోర్డు నేషనల్ కమిటీ మెంబర్గా ఉన్న బండి సంజయ్ కుమార్ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని అన్నారు. కేసీఆర్ అవినీతిపరుడని అంటున్న బీజేపీ, కేంద్ర మంత్రులు ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అలాంటి బీజేపీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు.
వనమా రాఘవను అరెస్ట్ చేయకుంటే.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు: ప్రభుత్వానికి భట్టి అల్టీమేటం
ఏం జరిగిందంటే.. ?
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల బదిలీల విషయంలో 317 జీవోను విడుదల చేసింది. ఇది ఉద్యోగులకు తీవ్ర నష్టం చేకూర్చే విధంగా ఉందని దానిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ పార్టీ కార్యాలయంలో బండి సంజయ్ దీక్షకు దిగారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని అనే కారణంతో బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ బండి సంజయ్ తరఫు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఒక సారి కోర్టు బెయిల్ ఇవ్వకపోతే మరో సారి బెయిల్ పిటిషన్ వేశారు. అయితే అదే సమయంలో కరీంనగర్ పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో బండి సంజయ్ పిటిషన్ దాఖలు చేశారు. చివరికి బండి సంజయ్ కుమార్ కు బెయిల్ మంజూరైంది.