మునుగోడులో అమిత్ షా సభ వాయిదా?.. క్లారిటీ ఇచ్చిన బండి సంజయ్
మునుగోడులో ఈ నెల 21న బీజేపీ నిర్వహించే బహిరంగ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరవుతారని ఆ పార్టీ నేతలు తెలిపారు. ఈ సభ వేదికగానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాషాయ కండువా కప్పుకోనున్నారు. అయితే ఈ సభ వాయిదా పడినట్టుగా జరుగుతున్న ప్రచారం తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు.
కాంగ్రెస్ను వీడిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. బీజేపీ గూటికి చేరబోతున్నారు. ఈ క్రమంలోనే రాజగోపాల్ రెడ్డిపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురంలో వెలిసిన కొన్ని పోస్టర్ల కలకలం రేపుతున్నాయి. అయితే పోస్టర్స్పై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. అలాగే మునుగోడులో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభపై క్లారిటీ ఇచ్చారు. టీఆర్ఎస్లోకి వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంతకు అమ్ముడుపోయారని ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డి స్వయంగా కాంట్రాక్టర్ అని.. ఆయన డబ్బులకు అమ్ముడు పోవాల్సిన అవసరం లేదని అన్నారు.
తాము పోస్టర్లు వేయడం మొదలుపెడితే టీఆర్ఎస్, కాంగ్రెస్లు తట్టుకోలేవని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద గెలిచిన నాయకులు టీఆర్ఎస్లో చేరితే కాంగ్రెస్ నాయకులు ఎం చేశారని ప్రశ్నించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటేనని ఆరోపించారు. మునుగోడులో ఈ నెల 21న అమిత్ షా భారీ బహిరంగ సభ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. గిట్టని వారు అమిత్ షా సభ వాయిదా అని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ముందు రెండు, మూడు డేట్లు అనుకున్నామని.. అందులో 21వ తేదీన వస్తానని అమిత్ షా మాటిచ్చారని చెప్పారు. అయితే గతంలో చేసిన సంప్రదింపులను పట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక, తన పాదయాత్ర చూసి భయపడి ప్రభుత్వం కొత్త పెన్షన్లు ఇస్తోందని బండి సంజయ్ అన్నారు.
ఇదిలా ఉంటే బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర నేటితో 11వ రోజుకు చేరింది. ఈ రోజు ఉదయం నార్కట్ పల్లి మండలం అమ్మనబోలు శివారులో బండిసంజయ్ పాదయాత్రను ప్రారంభించారు. నకిరేకల్ నినియోజకవర్గం నుంచి తుంగతుర్తి నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించింది.
ఇక, యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా వెలిసిన కొన్ని పోస్టర్ల కలకలం రేపుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న పోస్టర్స్లో.. ‘‘రూ. 22 వేల కోట్ల కాంట్రాక్ట్ కోసం.. 13 ఏళ్ల నమ్మకాన్ని అమ్ముకున్న ద్రోహివి. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మను ఈడీ వేధిస్తున్న రోజే.. అమిత్ షాను బేరామడిని నీచుడివి అంటూ పోస్టర్లలో పేర్కొన్నారు. మునుగోడు నిన్ను క్షమించేది లేదు’’ అని పేర్కొన్నారు. అయితే ఈ పోస్టర్లను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభిమానులు తొలగిస్తున్నారు.