పొత్తులపై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు.. కాంగ్రెస్ విషయంలో ఆమె ఏమన్నారంటే..
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పదజాలం అవమానకరంగా ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తనపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయని చెప్పారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పదజాలం అవమానకరంగా ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తనపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయని చెప్పారు. కల్వకుంట్ల కవిత ఈరోజు మీడియా ప్రతినిధులతో చిట్చాట్లో మాట్లాడుతూ.. బండి సంజయ్ ఆయన పదవికి మచ్చతెచ్చే విధంగా మాట్లాడుతున్నారని అన్నారు. మహిళలను అవహేళన చేసే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు సరైన సమయంలో బీజేపీని తిప్పకొడతారని అన్నారు.
బతుకమ్మ పండగను అవమానించేలా బండి సంజయ్ మాట్లాడారని.. ఆ మాటలు బాధ కలిగించాయని కవిత చెప్పారు. బీఆర్ఎస్తో బీజేపీ బ్రెయిన్ డ్యామేజ్ అయిందని ఎద్దేవా చేశారు. యాగాలు చేయడం కేసీఆర్కు కొత్త కాదని అన్నారు. బీఆర్ఎస్కు దైవశక్తి అవసరం కనుకే యాగాలు చేస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్లో చాలా రాష్ట్రాల నుంచి చేరికలు ఉంటాయని అన్నారు.
అభివృద్దిలో బీజేపీని కౌంటర్ చేస్తామని తెలిపారు. నిర్మలా సీతారామన్ వీక్ భాష మీద కాకుండా.. వీక్ రూపాయి గురించి మాట్లాడితే బాగుండేదని అన్నారు. తెలంగాణకు కేంద్ర నుంచి రావాల్సిన నిధులను నిర్మలా సీతారామన్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
ఏపీలో బీఆర్ఎస్ ఏం చేయాలన్నది ఎన్నికలప్పుడే నిర్ణయిస్తామని చెప్పారు. ఏపీ ప్రజలకు తాము వ్యతిరేకం కాదని అన్నారు. తాము ఏపీ రాజకీయ నేతలపైనే మాట్లాడామని చెప్పారు. కాంగ్రెస్తో కలవాలో వద్దో కూడా పరిస్థితిని బట్టే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకం కావచ్చని అన్నారు. ఎన్నికల సమయంలో ఆయా రాష్ట్రాలలో అభిప్రాయాలు తీసుకుంటామని.. ఏ పార్టీతో వెళ్లాలనేది అప్పుడున్న పరిస్థితుల ఆధారంగా నిర్ణయిస్తామని చెప్పారు. దేశంలో ప్రతి ఒక్కరు బాగుండాలనేదే బీఆర్ఎస్ అజెండా అని తెలిపారు.
భారత్ జాగృతి ఎప్పుడో రిజిస్టర్ అయిందని అన్నారు. త్వరలో బారత్ జాగృతి దూకుడు పెంచుతామని చెప్పారు. బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడుఎవరనే దానిపై సస్పెన్స్ ఉండనీయండి అని అన్నారు.