ఎర్రవాళ్లైనా, పచ్చవాళ్లైనా .. ఎవరినైనా తెచ్చుకో, బీజేపీతో బలప్రదర్శనకు సిద్ధమా : కేసీఆర్ బండి సంజయ్ సవాల్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు సవాల్ విసిరారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ఎర్రవాళ్లను, పచ్చవాళ్లను ఎవరిని తెచ్చుకున్నా తాము భయపడమని.. బీజేపీతో బల ప్రదర్శనకు ముఖ్యమంత్రి సిద్ధమా అని సంజయ్ సవాల్ విసిరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr), టీఆర్ఎస్ (trs) నేతలపై విమర్శలు కురిపించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay). ప్రజా సంగ్రమ యాత్రలో (praja sangrama yatra) భాగంగా గురువారం జనగామలో బీజేపీ (bjp) నిర్వహించిన సభలో పాల్గొని ప్రసంగించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని టీఆర్ఎస్ గూండాగిరి చేస్తోందని సంజయ్ ఆరోపించారు. టీఆర్ఎస్ దాడులకు బీజేపీ కార్యకర్తలు భయపడరని ఆయన పేర్కొన్నారు. ఎర్రవాళ్లను, పచ్చవాళ్లను ఎవరిని తెచ్చుకున్నా తాము భయపడమని.. బీజేపీతో బల ప్రదర్శనకు ముఖ్యమంత్రి సిద్ధమా అని సంజయ్ సవాల్ విసిరారు.
హిందూ ధర్మం కోసం బీజేపీ పనిచేస్తుందని.. పేదల కోసం అవసరమైతే గూండాగిరి చేస్తామని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాము ఏ మతానికి, ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదని బండి సంజయ్ స్పష్టం చేశారు. ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు వుంటాయని ఆయన హెచ్చరించారు. పెంబర్తిని ఇండస్ట్రియల్ కారిడార్ అన్నారు చేశారా అని బండి సంజయ్ ప్రశ్నించారు. దమ్ముంటే ఓవైసీతో భారత్ మాతాకీ జై అనిపించు అని సీఎం కేసీఆర్కు సవాల్ విసిరారు.
ఇకపోతే.. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పక్కా వ్యూహాలతో ముందుకెళుతోంది భారతీయ జనతా పార్టీ. ఇందులో భాగంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పార్టీకి, పదవికి రాజీనామా చేయించి మరో ఉపఎన్నికకు తెరతీసింది. ఇలా కోరితెచ్చుకున్న మునగోడు ఉపఎన్నికలను బిజెపి అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో మునుగోడు ప్రజలముందే రాజగోపాల్ రెడ్డిని పార్టీలో చేర్చుకోడానికి ఆగస్ట్ 21న బిజెపి భారీ బహిరంగను ఏర్పాటుచేసింది. ఈ బహిరంగ సభ ద్వారా ప్రత్యర్థులకు చెమటలు పట్టించాలని బిజెపి భావిస్తోంది. ఈ క్రమంలో బహిరంగ సభకు జనసమీకరణ చేపట్టే బాధ్యతను తెలంగాణ బిజెపి అధ్యక్సుడు బండి సంజయ్ పార్టీ సీనియర్లకు అప్పగించారు.
మునుగోడు నియోజకవర్గంలోని మండలాల వారిగా సీనియర్లకు బాధ్యతలు అప్పగించారు బండి సంజయ్. మండలానికి ఇద్దరు చొప్పున మొత్తం 9 మండలాలకు 18 మంది నాయకులను అమిత్ షా సభకు జనసమీకరణ, ఇతర ఏర్పాట్ల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు.
మండలాల వారిగా ఇంచార్జీల వివరాలు:
మునుగోడు : ఈటల రాజేందర్, చింతల రామచంద్రారెడ్డి
చౌటుప్పల్ అర్భన్ : గరికపాటి మోహన్ రావు, ఏనుగు రవీందర్ రెడ్డి
చౌటుప్పల్ రూరల్ : ఏపీ జితేందర్ రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
సంస్థాన్ నారాయణపూర్ : కూన శ్రీశైలంగౌడ్, రవీంద్ర నాయక్
చండూరు : రాజాసింగ్, విజయ్ పాల్ రెడ్డి
గట్టుప్పల్ : రఘునందన్ రావు, రాపోలు ఆనంద్ భాస్కర్
మర్రిగూడెం : కొండా విశ్వేశ్వర్ రెడ్డి, టి. ఆచారి
నాంపల్లి : ఏ. చంద్రశేఖర్ , ధర్మారావు