అవినీతి బయటపడుతుందనే...: హెచ్సీఏ నోటీసులపై అజారుద్దీన్
ఉద్దేశ్యపూర్వకంగానే తనకు హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ నోటీసులు జారీ చేసిందని హెచ్సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ చెప్పారు.
హైదరాబాద్: ఉద్దేశ్యపూర్వకంగానే తనకు హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ నోటీసులు జారీ చేసిందని హెచ్సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ చెప్పారు. హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ నోటీసులపై అజారుద్దీన్ గురువారం నాడు స్పందించారు. అవినీతిని అరికట్టడానికి అంబుడ్స్ మెన్ నియమిస్తే అడ్డుకొన్నారని ఆయన మండిపడ్డారు. వాళ్ల అవినీతి బయటపడుతోందనే ఉద్దేశ్యంతోనే తనపై కుట్రలు పన్నారని ప్రత్యర్ధులపై అజారుద్దీన్ విరుచుకుపడ్డారు.
హెచ్ సీ ఏ గౌరవానికి ఏనాడూ భంగం కల్గించేలా చర్యలు తీసుకోలేదని ఆయన తేల్చి చెప్పారు. అపెక్స్ కౌన్సిల్ లో ఐదుగురు ఒక వర్గంగా ఏర్పడ్డారని ఆయన చెప్పారు.ఈ ఐదుగురు హెచ్సీఏ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారని ఆయన విమర్శించారు.వాళ్ల నిర్ణయమే అపెక్స్ కౌన్సిల్ నిర్ణయంగా చెబితే ఎలా అని ఆయన ప్రశ్నించారు.
తన సభ్యత్వం రద్దు చేసే హక్కు వారికి లేదన్నారు.ప్రెసిడెంట్ లేకుండా మీటింగ్ లు ఎలా పెడతారని ఆయన ప్రశ్నించారు.అంబుడ్స్ మెన్ నియామకం సరైందేనని హైకోర్టు కూడ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.25 ఏళ్లుగా హెచ్సీఏలో అదే వ్యక్తులు ఉన్నారన్నారు. ఎవరినీ రానివ్వరన్నారు. ఒకవేళ కొత్త వ్యక్తులు వచ్చినా ఉండనివ్వరని చెప్పారు. బ్లాక్ మెయిల్ చేస్తారని ఆయన విమర్శించారు.