ఉప్పల్ భగాయత్ భూముల వేలం :హెచ్ఎండీఏకు కాసులు పంట .. ఎంత ఆదాయమో తెలుసా..?
ఉప్పల్ భగాయత్లో (uppal bhagayath layout) మూడో దశలో ప్లాట్ల వేలం ద్వారా హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)కు (hmda) కాసుల పంట పండింది. వేలంలో రూ.474 కోట్ల ఆదాయం హెచ్ఎండీఏకు లభించింది.
ఉప్పల్ భగాయత్లో (uppal bhagayath layout) మూడో దశలో ప్లాట్ల వేలం ద్వారా హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)కు (hmda) కాసుల పంట పండింది. వేలంలో రూ.474 కోట్ల ఆదాయం హెచ్ఎండీఏకు లభించింది. మొదటి రోజు గరిష్టంగా చదరపు గజం లక్ష రూపాయలకు పైగా పలికింది. రెండో రోజైన ఇవాళ జరిగిన వేలంలో గరిష్టంగా గజం రూ.72వేలు పలికింది. కనిష్టంగా రూ.36వేలు ధర పలికినట్టు అధికారులు వెల్లడించారు. 65,247 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన 16 ప్లాట్ల వేలంతో ఇవాళ హెచ్ఎండీఏకు రూ.333 కోట్ల ఆదాయం వచ్చింది. మొదటి రోజు రూ.141. 61 కోట్ల ఆదాయం వచ్చింది. దీనితో కలిపి మొత్తంగా 84,966 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన 39 ప్లాట్ల విక్రయంతో రూ.474.61 కోట్ల ఆదాయం లభించింది. సగటున గజం రూ. 55,859 రూపాయలు పలికినట్లు అధికారులు వెల్లడించారు.
Also Read:జూబ్లీహిల్స్తో పోటీ పడ్డ ఉప్పల్ భగాయత్ ల్యాండ్స్.. హెచ్ఎండీఏకు కాసుల పంట
కాగా.. తొలిరోజు వేలంలో అధికారుల అంచనాలు తారుమారు చేస్తూ.. మూసీ తీరాన ప్లాట్లు గతంలో కంటే భారీ స్థాయిలో ధరలు పలికాయి. జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాలతో పోటీ పడుతూ ఉప్పల్లోనూ రెండు ప్లాట్లు చదరపు గజానికి రూ.1.01 లక్షల చొప్పున ధర పలకడం విశేషం. మూడో దశలో మొత్తం 44 ప్లాట్లలో తొలిరోజు 23 ప్లాట్లకు వేలం జరిగింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీఎస్ వేదికగా జరిగిన ఈ ప్రక్రియలో పాల్గొన్న వారు ధరలు పెంచుకుంటూ పోయారు.
చదరపు గజానికి రూ.35వేల ధరను ప్రభుత్వం నిర్ణయించగా.. ఉదయం సెషన్లో ఓ ప్లాటుకు అత్యధికంగా చదరపు గజానికి రూ.77వేలు, రెండో సెషన్లో రెండు ప్లాట్లు ఏకంగా రూ.1.01లక్షల రికార్డు ధరలు పలికాయి. కేవలం 19 వేల చదరపు గజాలకే రూ.141.61 కోట్లు తొలి రోజు రాగా, శుక్రవారం మిగిలిన 1.15లక్షల చదరపు గజాల్లో మొత్తం 21 ప్లాట్లకు సగటున రూ.60వేలు వరకు వచ్చినా సుమారు రూ.900 కోట్లు ఖజానాకు వస్తాయని హెచ్ఎండీఏ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మల్టీ పర్పస్ జోన్కి కేటాయించిన 12.04 ఎకరాల్లో 10 ప్లాట్లతో పాటు మరో 11 ప్లాట్లను శుక్రవారం వేలం వేయనున్నారు. తొలిరోజు ప్రవాసీయులు పెద్ద ఎత్తున ఇందులో పాల్గొన్నారు. రెండో రోజు మల్టీపర్పస్ భూములకు చదరపు గజానికి కనీసం రూ.70వేల దాకా పలికే అవకాశాలున్నాయని అంచనా.