తెలంగాణలో వర్ష బీభత్సం: ఇప్పటి వరకు 50 మంది మృతి
తెలంగాణలో భారీ వర్షాలు, వరదల వల్ల 50 మంది వరకు మరణించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 11 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది.
తెలంగాణలో భారీ వర్షాలు, వరదల వల్ల 50 మంది వరకు మరణించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 11 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది.
భారీ వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు అందించాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు.
ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలకు కావల్సిన బియ్యం, పప్పుతో పాటు ఇతర నిత్యావసర సరుకులను, ఆహారాన్ని, ప్రతీ ఇంటికి మూడు చొప్పున రగ్గులను ప్రభుత్వ పక్షాన వెంటనే అందించాలన్నారు.
రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల తలెత్తిన పరిస్థితిపై సీఎం గురువారం ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. కొనసాగుతున్న సహాయ, పునరావాస చర్యలను సీఎం సమీక్షించారు.
రాబోయే రోజుల్లో చేయాల్సిన పనులను నిర్దేశించారు. హైదరాబాద్లో ఎక్కువ ప్రభావం ఉన్నందున జీహెచ్ఎంసిలో పరిస్థితిని చక్కదిద్దడంపై ప్రత్యేకంగా చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.
జీహెచ్ఎంసీలో సహాయ కార్యక్రమాలకు రూ.5 కోట్లతో పాటు మృతుల కుటుంబాలకు సీఎం రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ప్రతి ఇంటికి 3 రగ్గులతో పాటు నిత్యావసరాలు అందజేస్తామని.. పూర్తిగా కూలిన ఇళ్ల స్థానంలో కొత్త ఇళ్లు నిర్మిస్తామని కేసీఆర్ వెల్లడించారు. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు మరమ్మత్తులు చేయిస్తామని, నాలాలపై కూలిన ఇళ్లకు బదులు కొత్త ఇళ్లు నిర్మిస్తామని సీఎం ప్రకటించారు.