టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్‌కు సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ పరీక్షా పత్రం కూడా లీకైనట్లు అధికారులు నిర్ధారించారు. ప్రవీణ్ నుంచి పేపర్ కొన్న సాయి లౌకిక్, సాయి సుస్మితలను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్‌కు సంబంధించి మరో ఇద్దరిని సిట్ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏవో) పరీక్ష కోసం ప్రవీణ్ నుంచి పేపర్ కొన్న సాయి లౌకిక్, సాయి సుస్మితలను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తన ప్రియురాలు సుస్మిత కోసం లౌకిక్.. ప్రవీణ్ వద్ద నుంచి డీఏవో పేపర్ కొన్నాడు. ఇందుకోసం ప్రవీణ్‌కు రూ.6 లక్షలు ముట్టజెప్పాడు సాయి లౌకిక్.

అయితే కేసు దర్యాప్తులో భాగంగా ప్రవీణ్ ఖాతాలో వున్న 6 లక్షలపై అనుమానం రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో టీఎస్‌పీఎస్సీ పరీక్షలకు సంబంధించి డీఏవో పేపర్ కూడా లీకైనట్లుగా తేలింది. ఈ నేపథ్యంలో ప్రవీణ్ ఎంతమందికి ఈ పేపర్ అమ్మాడో తెలుసుకునేందుకు సిట్ ప్రయత్నిస్తోంది. మరోవైపు డీఏవో పరీక్ష రాసిన అభ్యర్ధులు ఆందోళనకు గురవుతున్నారు. అటు తాజా అరెస్ట్‌లతో కలిపి పేపర్ లీక్ కేసులో మొత్తం అరెస్ట్ అయిన వారి సంఖ్య 17కి చేరుకుంది.