జగన్ అక్రమాస్తుల కేసు..సబిత పై ఆరోపణలు..!
ఓబుళాపురం అక్రమ మైనింగ్ కు సంబంధించిన కేసులో తనపై కేసును కొట్టేయాలని కోరుతూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేసిన పిటిషన్ పై సీబీఐ కోర్టు సోమవారం విచారణ చేపట్టింది.
జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో భాగంగా పెన్నా సిమెంట్స్ కు గనుల లీజు కేటాయింపుల్లో మంత్రిగా సబితా ఇంద్రా రెడ్డి కీలక పాత్ర పోషించారంటూ సీబీఐ కోర్టులో కౌంటరు దాఖలు చేసింది. తాండూరుకు చెందిన గనుల లీజు పునరుద్దరణ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని సీబీఐ అధికారులు ఆరోపించారు. అభియోగాల నమోదు దశలో నిందితులను డిశ్చారర్జ్ చేయరాదని చెప్పారు. పెన్నా కేసులో పెన్నా గ్రూపు అధినేత పెన్నా ప్రతాప్ రెడ్డి డిశ్చార్జ్ పిటిషన్ పై సోమవారం వాదనలు కొనసాగాయి.
కాగా.. ఈ పిటిషన్ లపై తదుపరి విచారణ ఈ నెల 23కు వాయిదా పడింది. లేపాక్షికి అనంతపురంలో భూముల కేటాయింపు కేసులో డిశ్చార్జి పిటిషన్ లు దాఖలు చేయడానికి వారి తరపు న్యాయవాది గడువు కోరడంతో అనుమతించిన కోర్టు ఈ నెల 24కు వాయిదా వేసింది. ఈ లోగా పిటిషన్ లు దాఖలు చేయని పక్షంలో వాదనలకు సిద్ధం కావాలని ఆదేశించింది. అభియోగాల నమోదు ప్రక్రియలో వాదనలు వినిపించాలని ఇందూ శ్యాంప్రసాద్ రెడ్డి తరపు న్యాయాదికి ఆదేశించింది. ఇందూ టెక్ జోన్ లో నిందితుడిగా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్ డిశ్చార్జ్ పిటిషన్ లో కౌంటర్ దాఖలు చేయడానికి సీబీఐ గడువు కోరడంతో విచారణ ఈ నెల 20కి వాయిదా వేశారు.
ఓబుళాపురం అక్రమ మైనింగ్ కు సంబంధించిన కేసులో తనపై కేసును కొట్టేయాలని కోరుతూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేసిన పిటిషన్ పై సీబీఐ కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. నిబంధనల ప్రకారమే ఓఎంసీకి లీజు మంజూరు చేసినట్లు చెప్పారు. ఇందులో తనపై తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. దీనిపై విచారణ నేడు మళ్లీ కొనసాగనుంది.