కవితను ఈడీ విచారణకు ఎందుకు పిలిచింది? ధైర్యంగా ముందుకు వస్తే అన్ని కుంభకోణాల గురించి మాట్లాడదాం.. పవన్ ఖేరా
సోనియాగాంధీ, రాహుల్ గాంధీలపై ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలకు ఎఐసిసి అధికార ప్రతినిధి, పబ్లిసిటీ కమిటీ చైర్మన్ పవన్ ఖేరా సమాధానం ఇచ్చారు.

హైదరాబాద్ : హైదరాబాద్ వేదికగా నేటి నుంచి రెండు రోజులపాటు సిడబ్ల్యుసి సమావేశాలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాల కోసం ఎఐసిసి అధికార ప్రతినిధి, పబ్లిసిటీ కమిటీ చైర్మన్ పవన్ ఖేరా హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే మీడియా సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశంలో పవన్కేరా మాట్లాడుతూ.. తెలంగాణలో అన్ని పెద్ద కుంభకోణాలే వినిపిస్తున్నాయని విమర్శలు గుప్పించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేజీలు సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితను ఉద్దేశిస్తూ…‘కవితను ఈడీ విచారణకు ఎందుకు పిలిచింది?’ అని ప్రశ్నించారు. కేంద్రంతో కాంగ్రెస్ ఎలా పోరాడుతుందో కవితకు తెలియదా? అన్నారు. ధైర్యంగా ముందుకు వస్తే అన్ని కుంభకోణాల గురించి మాట్లాడదాం.. అని పిలిచారు. అదానీ గురించి కవిత ఎందుకు మాట్లాడరు? అని సూటిగా ప్రశ్నించారు.
సోనియా, రాహుల్ గాంధీలపై ఈడీ కేసులు ఏమయ్యాయి ? వాటిలో కదలికేదీ ? - కల్వకుంట్ల కవిత
చంద్రబాబు అరెస్టును సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఖండించారు అని చెబుతూ.. నేటినుంచి జరగనున్న సమావేశాల నిర్ణయాలను సాయంత్రం వివరిస్తాం.. అని చెప్పుకొచ్చారు..
ఇదిలా ఉండగా, కాంగ్రెస్ ముఖ్య నేతలైన రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, పవన్ బన్సల్, మల్లికార్జున్ ఖర్గేలను ఈడీ గతంలో నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణకు పిలిపించిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నాయకులను కూడా ఈ కేసులో విచారించిందని కవిత గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఆ కేసు ఏమైందని అడిగారు. ఈ కేసులో ఏడాదిన్నరగా చలనమెందుకు లేదని ఆమె ప్రశ్నించారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకి మధ్య అవగాహన కుదిరినట్టు ఉందని, అందుకే ఈడీ వారిని విచారణకు పిలవడం లేదని, కాంగ్రెస్ పార్టీ ఓ రాష్ట్రంలో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంటుందని, మరో రాష్ట్రంలో వారితోనే కొట్లాడుతుందని ఎద్దేవా చేశారు. ఓ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీతో పోరాడుతారు, మరో చోట ఆ పార్టీతోనే దోస్తీ చేస్తారన్నారు.