Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ కాంగ్రెస్‌‌పై హైకమాండ్ ఫోకస్: రంగంలోకి దిగ్విజయ్ సింగ్

తెలంగాణ రాష్ట్రంలో  చోటు  చేసుకున్న పరిణామాలపై ఎఐసీసీ ఫోకస్ పెట్టింది. ఈ సమస్యను చక్కదిద్దేందుకు గాను  కాంగ్రెస్ పార్టీ అగ్రనేత  దిగ్విజయ్ సింగ్ కు బాధ్యతలు అప్పగించారు. 

AICC appoints Digvijay Singh to Resolve Telangana Congress issues
Author
First Published Dec 20, 2022, 11:29 AM IST

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ లో చోటు  చేసుకున్నసమస్యలను పరిష్కరించాలని  ఎఐసీసీ భావిస్తుంది.   కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత దిగ్విజయ్ సింగ్ కు  ఈ బాధ్యతలను ఎఐసీసీ అప్పగించింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలపై  ఆ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్  నిన్న రాత్రి మల్లికార్జున ఖర్గేతో చర్చించారు.కాంగ్రెస్ పార్టీ సీనియర్లకు, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వర్గానికి మద్య గ్యాప్  ను పూడ్చాలని  కాంగ్రెస్ నాయకత్వం భావిస్తుంది.  

గతంలో ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి  దిగ్విజయ్ సింగ్  పార్టీ ఇంచార్జీగా  ఉన్నారు.  ఈ పరిణామాల నేపథ్యంలో దిగ్విజయ్ సింగ్  ను  ఈ సమస్య పరిష్కరించేందుకు గాను  పార్టీ నాయకత్వం నియమించింది.  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  పార్టీ మారకుండా  ఉండేందుకు  దిగ్విజయ్ సింగ్ చివరి నిమిషం వరకు  ప్రయత్నించిన విషయం తెలిసిందే.పార్లమెంట్ సమావేశాలు ముగిసిన మరునాడే  తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లతో  చర్చించాలని  ఎఐసీసీ నిర్ణయం తీసుకుంది.

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై  పార్టీలో సీనియర్లు చాలా కాలంగా గుర్రుగా  ఉన్నారు. రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని  సీనియర్లు అసంతృప్తితో  ఉన్నారు.  రేవంత్ రెడ్డి తీరుపై  గతంలో పలుమార్లు  రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని  సీనియర్లు  అభిప్రాయపడుతున్నారు.  పార్టీ ప్రకటించిన జంబో కమిటీల్లో  తమ వర్గానికి  ప్రాధాన్యత లేకపోవడం సీనియర్లకు ఆగ్రహం తెప్పించింది.  ఈ పరిణామాలపై  సీనియర్లు  రెండు దఫాలు సమావేశమయ్యారు.మరోసారి ఇవాళ  సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు.

కాంగ్రెస్ పార్టీలో చోటు  చేసుకున్న పరిణామాలపై అధిష్టానం చర్చించింది. రేవంత్ రెడ్డిపై సీనియర్లు చేస్తున్న ఆరోపణలు, సీనియర్లపై  రేవంత్ రెడ్డి వర్గం  చేస్తున్న ఆరోపణలపై  దిగ్విజయ్ సింగ్ చర్చించనున్నారు. ఒక్కొక్కరితో  దిగ్విజయ్ సింగ్ విడివిడిగా  మాట్లాడి  పార్టీ నాయకత్వానికి  నివేదిక  ఇవ్వనున్నారు.

కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే దిగ్విజయ్ సింగ్  ను తెలంగాణ పరిణామాలపై చర్చించాలని  ఆదేశించారు.ఈ ఆదేశాలు అందిన వెంటనే దిగ్విజయ్ సింగ్ రంగంలోకి దిగారు.  సీనియర్లతో దిగ్విజయ్ సింగ్ ఫోన్లో మాట్లాడారు.  రేవంత్ రెడ్డి వర్గానకి చెందిన కొందరు నేతలతో కూడా దిగ్విజయ్ సింగ్ మాట్లాడారని సమాచారం. పార్టీ నేతల మధ్య సమస్యకు గల కారణాలపై   దిగ్విజయ్ సింగ్ ఆరా తీశారు.రెండు మూడు రోజుల్లో  తాను  హైద్రాబాద్ కు వస్తానని  దిగ్విజయ్ సింగ్  పార్టీ నేతలకు  సమాచారం ఇచ్చారు.

also read:హుటాహుటిన రాజస్థాన్‌కి మాణికం: తెలంగాణ కాంగ్రెస్ పరిణామాలపై రాహుల్‌తో చర్చించనున్న ఠాగూర్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిణామాలపై ప్రియాంకగాంధీ కూడా  ఆరా తీశారు.  కాంగ్రెస్ సీనియర్లు మాట్లాడిన  మీడియా సమావేవం  వీడియో క్లిప్పింగ్ లను   కూడా ప్రియాంక గాంధీకి పార్టీ నేతలు  పంపారు. సీనియర్లకు, రేవంత్ రెడ్డి వర్గానికి మధ్య  జరిగిన  మాటల యుద్ధంపై  కూడా  పార్టీ నేతలు ఆరా తీస్తున్నారు.రెండు వర్గాల నేతలు  ఏం కోరుకుంటున్నారనే విషయాలపై దిగ్విజయ్ సింగ్  పార్టీ నేతలతో చర్చించనున్నారు. 

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios