కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకున్న విధ్వంసంకు సంబంధించి పోలీసులు పలువురుని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకున్న విధ్వంసంకు సంబంధించి పోలీసులు పలువురుని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రైల్వేస్టేషన్ దాడి కేసులో అరెస్ట్ అయిన 46 మంది నిందితులు ప్రస్తుతం చంచల్గూడ జైలులో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న నిందితుల కుటుంబసభ్యులు చంచల్గూడ జైలుకు చేరుకుంటున్నారు. ములాకత్లో తమవారిని కలిసేందుకు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే చంచల్గూడ జైలు ముందు నిందితుల తల్లిదండ్రులు పడిగాపులు కాస్తున్నారు. తమ పిల్లలకు ఏ పాపం తెలియదంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు.
ఇక, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో విధ్వంసం సృష్టించిన ఆందోళనకారులకు యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉందని రైల్వే ఎస్పీ అనురాధ ఆదివారం వెల్లడించారు. ఇప్పటివరకు 46 మందిని అరెస్టు చేసి, చంచల్గూడ జైలుకు రిమాండ్ చేశామని తెలిపారు. రెండు వేల మంది ఈ ఆందోళనలో పాల్గొన్నారని ఆమె చెప్పారు. కోచింగ్ సెంటర్లు ఆర్మీ ఉద్యోగార్థుల్ని రెచ్చగొట్టాయని.. సదరు కోచింగ్ సెంటర్లను గుర్తించామని అనురాధ తెలిపారు.
వీరందరికీ రైల్వే యాక్ట్ సెక్షన్ 150 కింద యావజ్జీవ జైలు శిక్ష పడే అవకాశం వుందని ఆమె వెల్లడించారు. అలాగే యువకులను రెచ్చగొట్టిన వాట్సాప్ గ్రూప్లను కూడా గుర్తించామని అనురాధ తెలిపారు. వాట్సాప్ గ్రూప్లు ఏర్పాటు చేసుకుని ఎలా దాడి చేయాలో చర్చించుకున్నారని ఆమె పేర్కొన్నారు. పోలీసులు, ప్రయాణీకులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారని అనురాధ తెలిపారు. అరెస్ట్ అయిన వాళ్లంతా తెలంగాణ వాళ్లేనని... ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.
ఈస్ట్ కోస్ట్, దనాపూర్ ఎక్స్ప్రెస్లో వాళ్లు వచ్చారని అనూరాధ తెలిపారు. ఆందోళనకారులను అదుపు చేసుందేరకు ఆర్పీఎఫ్ వాళ్లు కాల్పులు జరిపారని ఆమె చెప్పారు. 17న ఉదయం 8 గంటలకు 300 మంది స్టేషన్లోకి చొరబడ్డారని అనూరాధ తెలిపారు. రూ.12 కోట్లు నష్టం వాటిల్లినట్లు సమాచారం వుందన్నారు. ఘటనలో 9 మంది రైల్వే సిబ్బంది గాయపడ్డారని.. నిందితుల్ని పట్టుకునేందుకు సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలిస్తున్నట్లు ఆమె చెప్పారు. ఒక కోచ్ను పెట్రోల్ పోసి తగులబెట్టారని.. పదుల సంఖ్యలో కోచ్లు ధ్వంసమయ్యాయని అనూరాధ పేర్కొన్నారు.
