సింగరేణి బొగ్గుగనిలో ప్రమాదం... నలుగురు కార్మికుల మృతి
పెద్దపెల్లి జిల్లా రామగుండం ఓపెన్ కాస్ట్ వన్ లో మహాలక్ష్మి కంపెనీ ఓబిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
పెద్దపెల్లి జిల్లా రామగుండం ఓపెన్ కాస్ట్ వన్ లో మహాలక్ష్మి కంపెనీ ఓబిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బొగ్గు తవ్వకాల్లో భాగంగా ఏర్పాటుచేసిన పేలుడు పదార్థాలు మిస్ ఫైర్ అయ్యాయి. దీంతో నలుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలవడంతో గోదావరిఖని ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. రామగుండం ఓపెన్ కాస్ట్ 1 గనిలో మహాలక్ష్మి ఓబీ కాంట్రాక్టు లో కొందరు కార్మికులు బ్లాస్టింగ్ సంబంధించి విధులు నిర్వహిస్తుండగా ఒక్కసారి పేలుడు సంభవించింది.పేలుడు ధాటికి నలుగురు కాంట్రాక్టు కార్మికులు అక్కడికక్కడే మృతిచెందగా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
సాధారణంగా భాస్టింగ్ పనులు సాయంత్రం నిర్మావహిస్తుంటారు.అయితే ఉదయం సమయంలో మందు గుండును ఓబీ కుప్పల్లో అమరుస్తుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. దీంతో నలుగురు కార్మికులు అక్కడికక్కడే మృతిచెందారు. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండటంతో గోదావరిఖని సింగరేణి ఆసుపత్రికి తరలించారు.
సంఘటన విషయం తెలిసిన వెంటనే పెద్దపెల్లి ఎంపీ వెంకటేష్, ఎమ్మెల్యే చందర్, కాంగ్రెస్ నేత మక్కన్ సింగ్,మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ తో పాటు కార్మిక నాయకులు సంఘటన గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.కార్మిక సంఘాల నాయకులు ఆందోళన చేపట్టకుండా పోలిసులు బందో బస్తు ఏర్పాటు చేశారు.
పేలుళ్ల దాటికి కార్మికుల మృతదేహాలు చిద్రమయ్యాయి. దీంతో శరీర భాగాలను సేకరించి పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాద స్థలాన్ని స్థానిక పోలీసులతో పాటు సింగరేణి అధికారులు కూడా పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు, సింగరేణి అధికారులు.
read more మాకూ 50 లక్షలు కావాలి.. బొగ్గు గని కార్మికుడి డిమాండ్...
ఇటీవల కాలంలో సింగరేణి గనుల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇటీవలే గోదావరిఖనికి చెందిన ఓ కార్మికుడు 11ఇంక్లైన్ బొగ్గుబావిలో దిగి దాదాపు ఆరు రోజులపాటు అదృశ్యమయ్యాడు. ఇలా వారం రోజుల పాటు గనిలో గాలించిన రెస్క్యూ సిబ్బంది ఎట్టకేలకు అతడి మృతదేహాన్ని కనుగొన్నారు.
సింగరేణిలో పంప్ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్న సంజీవ్ ఒకటో డిప్ వద్ద పంపులను రన్ చేయడానికి వెళ్లి తిరిగి పైకి రాలేదు. దీంతో రాత్రంతా గని లోపల కార్మికుల సాయంతో సింగరేణి అధికారులు గాలించినా అతడి ఆచూకి మాత్రం దొరకలేదు. దీంతో సింగరేణి అధికారులు రెస్క్యూ బృందాన్ని రంగంలోకి దింపారు.
ఆరు రోజులుగా గని లోపల పూర్తిస్థాయిలో గాలింపుచర్యలు చేపట్టిన సిబ్బంది ఎట్టకేలకు అతడి మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనపై కార్మిక సంఘాలు కన్నెర్ర చేస్తాయన్న అనుమానంతో హడావిడిగా అతడి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇందుకోసం మృతుడి కుటుంబ సభ్యులపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది.
సంజీవ్ మృతిచెందినట్లు నిర్ధారణ కావడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అతడి మృతికి గల కారణం అధికారులు తెలియజేయకపోవడంతో కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ దుర్ఘటన మరువక ముందే తాజాగా మరో నలుగురి ప్రాణాలు బలయ్యాయి.