శంషాబాద్లో భారీగా ఐ ఫోన్లు స్వాధీనం: ఇద్దరి అరెస్ట్
హైద్రాబాద్ శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం నాడు కోటి రూపాయాలకు పైగా విలువైన 80 ఐ ఫోన్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు.
హైదరాబాద్: హైద్రాబాద్ శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం నాడు కోటి రూపాయాలకు పైగా విలువైన 80 ఐ ఫోన్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు.షార్జా నుండి వచ్చిన ఇద్దరు ప్రయాణీకుల నుండి ఐ ఫోన్లను స్వాధీనం చేసుకొన్నారు. లగేజీ బెల్ట్ వద్ద లగేజీ తీసుకొని బయటకు వెళ్తున్న సమయంలో తనిఖీలు నిర్వహించగా ఐ ఫోన్లు లభ్యమయ్యాయి. ఐ ఫోన్లను పన్నులు చెల్లించకుండా అక్రమంగా ఐ ఫోన్లుగా గుర్తించినట్టుగా కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ జేఎస్ చంద్రశేఖర్ తెలిపారు.
ఐ ఫోన్ 12 ఫ్రో, ఐ ఫోన్ 12 ప్రో మ్యాక్స్ మోడల్స్ ఉన్నాయని అధికారులు తెలిపారు. ఒక్కొక్క మొబైల్ విలువ లక్ష నుండి లక్షన్నర విలువ చేస్తాయని కస్టమ్స్ అధికారులు వివరించారు.నిందితుల నుండి రూ. 4 లక్షల నగదును కూడ స్వాధీనం చేసుకొన్నారు. అరెస్టైన ఇద్దరిలో ఒకరు గుజరాత్ రాష్ట్రానికి చెందినవారు కాగా, మరో వ్యక్తి హైద్రాబాద్ కు చెందిన వారని కస్టమ్స్ అధికారులు వివరించారు.