ఢిల్లీ, ముంబైలతో పోటీ.. తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్: ఒక్క రోజులో 730 కేసులు, ఏడుగురి మృతి
తెలంగాణలో కరోనా కేసులు కనీవినీ ఎరుగని రీతిలో పెరిగిపోతున్నాయి. ఆదివారం ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడుతో పోటీపడుతూ రికార్డు స్థాయిలో ఒక్కరోజులో 730 కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో కరోనా కేసులు కనీవినీ ఎరుగని రీతిలో పెరిగిపోతున్నాయి. ఆదివారం ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడుతో పోటీపడుతూ రికార్డు స్థాయిలో ఒక్కరోజులో 730 కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి తెలంగాణలో కేసుల సంఖ్య 7,802కి చేరుకుంది. ఇవాళ వైరస్ కారణంగా ఏడుగురు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 210కి చేరింది.
రాష్ట్రంలో ప్రస్తుతం 3,861 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 3, 731 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఆదివారం నమోదైన కేసుల్లో ఒక్క హైదరాబాద్లోనే 659 మందికి పాజిటివ్గా తేలడంతో ప్రభుత్వ వర్గాలు ఉలిక్కిపడ్డాయి.
ఆ తర్వాత జనగామ 34, రంగారెడ్డి 10, మేడ్చల్ 9, అసిఫాబాద్ 3, వరంగల్ 6, వికారాబాద్లో రెండు కేసులు, సంగారెడ్డి, ఆదిలాబాద్, నారాయణ్పేట్, మెదక్, నల్గొండ, యాదాద్రి, భద్రాద్రిలో ఒక్కో కేసు నమోదయ్యాయి.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావుకు కరోనా సోకింది. ఆయన ఆపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అస్వస్థతకు గురైన వి. హనుమంతరావు శనివారం నాడు ఆపోలో ఆసుపత్రిలో చేరడంతో వైద్యులు ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్గా తేలింది.
మరో వైపు ఇప్పటికే రాష్ట్రంలోని ముగ్గురు ఎమ్మెల్యేలు కూడ కరోనా బారినపడ్డారు. తొలుత జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా కరోనాతో చికిత్స పొందుతున్నారు.