Asianet News TeluguAsianet News Telugu

నందకుమార్ మోసం చేశాడు.. ఈడీకి అదే చెప్పా , రోహిత్ రెడ్డి గురించి అడగలేదు : అభిషేక్

7 హిల్స్ మాణిక్ చంద్ గుట్కా కేసులో తనను ఈడీ అధికారులు ప్రశ్నించారని తెలిపారు ఆ సంస్థ యజమాని అభిషేక్. గురువారం దాదాపు 9 గంటల పాటు ఆయనను విచారించింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. 
 

7 hills manikchand owner abhishek ed inquiry end
Author
First Published Dec 22, 2022, 8:59 PM IST

7 హిల్స్ మాణిక్ చంద్ అధినేత అభిషేక్ ఈడీ విచారణ ముగిసింది. గురువారం ఉదయం నుంచి దాదాపు 9 గంటల పాటు ఆయనను ప్రశ్నించారు ఈడీ అధికారులు. ఈ సందర్భంగా అభిషేక్ మాట్లాడుతూ.. 7 హిల్స్ మాణిక్ చంద్ గుట్కా కేసులో తనను ప్రశ్నించారని తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును ప్రస్తావించలేదని అభిషేక్ చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రోహిత్ రెడ్డి గురించి ఎలాంటి ప్రశ్నలు వేయలేదన్నారు. రోహిత్ రెడ్డి సోదరుడితో వ్యాపార లావాదేవీల వివరాలు ఈడీకి ఇచ్చానని అభిషేక్ పేర్కొన్నారు. నందకుమార్ హోటల్‌లో రూ.1.75 కోట్లు పెట్టుబడి పెట్టానని ఆయన తెలిపారు. నందకుమార్ తనను మోసం చేశాడని ఈడీకి చెప్పానని అభిషేక్ పేర్కొన్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు తనను మరోసారి విచారణకు రమ్మన్నారని ఆయన తెలిపారు. 

ఇదిలావుండగా... ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగ్గురికి తెలంగాణ హైకోర్టు స్టే పొడిగించింది. ఈ నెల 30 వరకు బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామిలకు స్టేను పొడిగిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. కాగా.. ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు జగ్గుస్వామి, బీఎల్ సంతోష్‌లకు సిట్ నోటీసులపై తెలంగాణ హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. 

Also REad: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు .. నందకుమార్ కస్టడీకి‌ అనుమతించండి : నాంపల్లి కోర్టులో ఈడీ పిటిషన్

ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌ నిందితులతో మాట్లాడినట్లు సిట్ అనుమానిస్తోంది. ఈ క్రమంలోనే ఆయనను విచారిస్తే పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని సిట్ వాదిస్తోంది. ఈ కారణం చేత సిట్ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. అయితే దీనిపై బీఎల్ సంతోష్ హైకోర్టును ఆశ్రయించడంతో సిట్ నోటీసులపై న్యాయస్థానం స్టే విధించింది. మరోవైపు.. ఈ నెల 28న బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, సునీల్ బన్సల్, తరుణ్ చుగ్‌లు తెలంగాణకు రానున్నారు. ఈ నేపథ్యంలో సిట్ ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు వున్నాయా అంటూ చర్చ జరుగుతోంది. 

మరోవైపు.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడిగా వున్న నందకుమార్‌ను కస్టడీలోకి తీసుకోవాలని ఈడీ భావిస్తోంది. దీనిలో భాగంగా అతనిని ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని నాంపల్లి కోర్టును ఈడీ ఆశ్రయించింది. గుట్కా మనీలాండరింగ్, రోహిత్ రెడ్డి పాత్రపై నందకుమార్‌ని ప్రశ్నించాలని ఈడీ భావిస్తోంది. మరోవైపు ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసింది ఈడీ. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మనీలాండరింగ్ జరిగిందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అనుమానిస్తోంది. డిసెంబర్ 15న ఈసీఐఆర్ నమోదు చేసింది. ఇప్పటికే తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని రెండు రోజుల పాటు ఈడీ ప్రశ్నించింది. అలాగే 7 హిల్స్ మాణిక్ చంద్ యజమాని అభిషేక్ ఆవులను కూడా విచారిస్తోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios