కూల్ డ్రింక్ అనుకుని పురుగుల మందు తాగి ఐదేళ్ల చిన్నారి మృతి..
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని భీంపూర్లో విషాదం చోటుచేసుకుంది. ఓ చిన్నారి కూల్ డ్రింక్ అనుకుని పురుగుల మందు తాగి మృతిచెందింది.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని భీంపూర్లో విషాదం చోటుచేసుకుంది. ఓ చిన్నారి కూల్ డ్రింక్ అనుకుని పురుగుల మందు తాగి మృతిచెందింది. వివరాలు.. భీంపూర్ గ్రామానికి చెందిన రాజేష్, లావణ్య దంపతులకు ఓ కొడుకు, ఐదేళ్ల కూతురు శాన్వి ఉన్నారు. శాన్విక ఇంటివద్ద ఆడుకుంటూ కూల్ డ్రింక్ అనుకుని ఓ బాటిల్లో ఉన్న పురుగుల మందు తాగేసింది. ఆ తర్వాత చిన్నారి వాంతులు చేసుకోవడం గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కాగజ్ నగర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడ డాక్టర్లు ఆస్పత్రిలో చేర్చుకోకపోవడంతో.. మంచిర్యాలకు తరలించారు.
అయితే చిన్నారిని ఆస్పత్రిలో చేర్చుకోవడానికి కొన్ని ఆస్పత్రులు నిరాకరించినట్టుగా సమాచారం. చివరకు ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే చిన్నారి మృతిచెందినట్టుగా డాక్టర్లు తెలిపారు. చిన్నారి మృతిలో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇక, పురుగుల మందు కూల్డ్రింక్ బాటిల్లో ఉంచడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టుగా తెలుస్తోంది.