నర్సాపూర్ ఎస్బీఐ బ్యాంక్లో నిధుల్ గోల్మాల్.. లెక్కతేలని రూ. 5.20 కోట్లు..!
మెదక్ జిల్లా నర్సాపూర్ ఎస్బీఐ బ్యాంక్లో నిధుల గోల్మాల్ జరిగింది. మొత్తం రూ. 5.20 కోట్ల రూపాయలకు లెక్కలు తేలకపోవడంతో ఈ మేరకు డబ్బులు గోల్మాల్ అయినట్లు అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది.
మెదక్ జిల్లా నర్సాపూర్ ఎస్బీఐ బ్యాంక్లో నిధుల గోల్మాల్ జరిగింది. మొత్తం రూ. 5.20 కోట్ల రూపాయలకు లెక్కలు తేలకపోవడంతో ఈ మేరకు డబ్బులు గోల్మాల్ అయినట్లు అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. నిధుల మాయం వెనక ఉద్యోగుల ప్రయేయం ఉన్నట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. నర్సాపూర్ ఎస్బీఐలో నిధులు దుర్వినియోగంపై ఆరోపణలు రావడంతో.. బ్యాంకు ఉన్నతాధికారులు ఆడిటర్లను పంపి ఈనెల 21న అర్ధరాత్రి వరకు ఆడిట్ చేయించారు. ఈ నెల 22 న బ్యాంకులో, ఏటీఎంలలో అన్ని లావాదేవీలను నిలిపి వేసి ఆడిట్ చేయించారు.
శుక్రవారం వరకు జరిగిన విచారణలో రూ. 5 కోట్లకు పైగా అవకతవకలు జరిగినట్టుగా గుర్తించడంతో.. కేసును ఓ దర్యాప్తు సంస్థకు అప్పగించినట్టుగా తెలుస్తోంది. ఈ విషయమై బ్యాంకు మేనేజర్ నర్సయ్యను వివరణ కోరగా.. అవకతవకలు జరిగిన విషయమై ఇతర బ్యాంకుల నుంచి వచ్చిన అడిటర్లు విచారణ చేపట్టారని చెప్పారు. అయితే పూర్తి వివరాలను మాత్రం వెల్లడించలేదు.
ఇక, నిధుల గోల్మాల్పై ఓ బ్యాంకు ఉద్యోగిపై అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు సమాచారం. కొన్ని రోజులుగా లీవ్లో ఉన్న ఉద్యోగి ఆస్తుల వివరాలను ఎంక్వయిరీ టీమ్ సేకరిస్తున్నట్టుగా తెలుస్తోంది.