తెలంగాణలో 45వేల పోస్టుల ఖాళీలు: సీఎస్కు చేరిన నివేదిక
తెలంగాణ లోని పలు శాఖలు, సంస్థల్లో ఉద్యోగ ఖాళీల వివరాలు సోమవారం రాత్రి ప్రభుత్వానికి చేరాయి.
హైదరాబాద్:తెలంగాణ లోని పలు శాఖలు, సంస్థల్లో ఉద్యోగ ఖాళీల వివరాలు సోమవారం రాత్రి ప్రభుత్వానికి చేరాయి.
వివిధ శాఖల్లో సుమారు 45 వేలు, సంస్థల్లో 20 వేలు భర్తీ చేయాల్సి ఉందని ముఖ్య కార్యదర్శులు ప్రభుత్వానికి నివేదించారు.ఇందులో నాలుగో తరగతి ఉద్యోగుల వివరాలు ఉన్నట్టు తెలిపారు.
ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల సంఖ్యను విడిగా పొందు పర్చారు. పోలీసు, విద్య, వైద్య ఆరోగ్య శాఖలలో ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి. పాఠశాల విద్యా శాఖలో 9,600 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆ శాఖ ఉన్నతాధికారులు నివేదికలో పేర్కొన్నారు.
ఇందులో ప్రత్యేక గ్రేడ్ ఉపాధ్యాయులు (ఎస్జీటీ) 5,800, స్కూలు అసిస్టెంట్లు 2,500, భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయులు 300, మోడల్ పాఠశాలల ఉపాధ్యాయుల పోస్టులు 1000 ఉన్నాయి.ఇవి గాక ఉన్నత విద్య, విశ్వవిద్యాలయాలు, సాంకేతిక విద్యా శాఖల పోస్టులు మరో మూడు వేల వరకు ఉన్నాయి.
శాఖల వారిగా వచ్చిన వివరాలను ఆర్థిక శాఖ క్రోడీకరిస్తోంది. మొత్తం పోస్టుల్లో నాలుగో తరగతివి మినహాయించి, మిగిలినవి ఖాళీగా చూపనున్నారు. ఒకటి, రెండు రోజుల్లో కచ్చితమైన సంఖ్యపై స్పష్టత వచ్చే వీలుంది.