కరీంనగర్ జిల్లాలో విషాదం.. 45 రోజు వ్యవధిలో ఒకే కుటుంబంలో నలుగురు మృతి.. అంతుచిక్కని మిస్టరీ..!
కరీంనగర్ జిల్లా గంగాధరలో విషాదం చోటుచేసుకుంది. 45 రోజల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందడం అంతుచిక్కని మిస్టరీగా మారింది.
కరీంనగర్ జిల్లా గంగాధరలో విషాదం చోటుచేసుకుంది. 45 రోజల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే భార్య, ఇద్దరు పిల్లలు చనిపోగా.. గత రాత్రి వాంతులు చేసుకుని భర్త కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో వారి మరణాల వెనక మిస్టరీ ఏమిటనేది తెలియాల్సి ఉంది. వివరాలు గంగాధరకు చెందిన శ్రీకాంత్, మమత భార్యభర్తలు. వీరికి కూతురు అమూల్య (6), కొడుకు అద్వైత్ (2) ఉన్నారు. అయితే అద్వైత్ గత నెల 16న అనారోగ్యంతో మరణించారు. అమూల్య కూడా అవే లక్షణాలతో గత నెల 29న మృతిచెందింది.
ఆ తర్వాత మమత కూడా అనారోగ్యంతో మృతిచెందింది. హైదరాబాద్లోని ఆస్పత్రుల్లో వైద్యం అందించినా వారి ప్రాణాలు దక్కలేదు. ముగ్గురు ఒకే రకమైన లక్షణాలతో మరణించినట్టుగా చెబుతున్నారు. శ్రీకాంత్ కూడా అదే లక్షణాలతో కరీంనగర్ ఆస్పత్రిలో మృతిచెందారని ప్రచారం సాగుతుంది. అయితే శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే అంతుచిక్కని వ్యాధితోనే కుటుంబంలోని నలుగురు మృతిచెందారని గ్రామంలో ప్రచారం సాగుతుంది.
భార్య, పిల్లలు మృతిచెందిన తర్వాత శ్రీకాంత్ ఒంటరి అయిపోయాడు. అదే సమయంలో కట్నం డబ్బులు తిరిగి ఇవ్వాలని భార్య తరపున బంధువులు శ్రీకాంత్పై ఒత్తిడి చేశారని.. మరోవైపు ఉద్యోగం కూడా కోల్పోయాడని.. ఈ క్రమంలోనే అతడు తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుని ఉంటాడని వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
అయితే ఒకే కుటుంబానికి చెందిన నలుగురు 45 రోజుల వ్యవధిలో మృతిచెందడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే భార్య, ఇద్దరు పిల్లల నమూనాలను హైదరాబాద్లో ల్యాబ్కు పంపారు. ఇందుకు సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉంది.