బెల్లంపల్లి పాలిటెక్నిక్ కాలేజీలో కరోనా కలకలం: 20 మందికి కోవిడ్
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో కరోనా కలకలం సృష్టించింది. మంగళవారం నాటికి ఈ కాలేజీలో 20 మందికి కరోనా సోకినట్టుగా వైద్యులు గుర్తించారు.
ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో కరోనా కలకలం సృష్టించింది. మంగళవారం నాటికి ఈ కాలేజీలో 20 మందికి కరోనా సోకినట్టుగా వైద్యులు గుర్తించారు.
ఈ కాలేజీలో విద్యార్ధులు, సిబ్బందికి కలిపి 146 మందిక పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 20 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఎనిమిది మంది విద్యార్ధులతో పాటు 12 మంది సిబ్బందికి కరోనా సోకింది.దీంతో విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కరోనా సోకినవారిని ఐసోలేషన్ కు తరలించారు.
తెలంగాణలో రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి.ఈ కేసులను దృష్టిలో పెట్టుకొని రేపటి నుండి విద్యా సంస్థలను మూసివేస్తున్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం మంగళవారం నాడు ప్రకటించింది.
మెడికల్ కాలేజీలను మినహయించి రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలను మూసివేస్తున్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది. కరోనా కేసులు పెరగకుండా ముందుజాగ్రత్తలో భాగంగా ఈ నిర్ణయం తీసుకొన్నారు.రాష్ట్రంలో పలు విద్యాసంస్థల్లో కరోనా కేసులు నమోదౌతున్నాయి. దీంతో ప్రభుత్వం విద్యా సంస్థలను మూసివేయాలని నిర్ణయం తీసుకొంది.