దేవుడి గుడికే కన్నం వేసి అడ్డంగా దొరికిన దొంగలు
హైదరాబాద్ నగరంలో దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు సభ్యుల ముఠాను రాచకొండ కమిషనరేట్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 26 లక్షల విలువైన వస్తువులను రాచకొండ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు సభ్యుల ముఠాను రాచకొండ కమిషనరేట్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 26 లక్షల విలువైన విగ్రహాలను రాచకొండ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే సారంగ వెంకటేష్, సారంగ సంజీవులు అన్నదమ్ములు. 30 ఏళ్లుగా హైదరాబాద్ ఎల్ బీ నగర్ లోని ఎన్టీనగర్ లో నివాసం ఉంటున్నారు. సారంగ వెంకటేష్ అల్లం వెల్లుల్లి వ్యాపారం చేస్తుంటాడు. అతని సోదరుడు సారంగ సంజీవులు ఆటో డ్రైవర్. సారంగ వెంకటేష్ కేబుల్ వైర్లు, ట్రాన్స్ ఫార్మర్ కాపర్ వైర్లు దొంగతనం చేసేవాడు. గత 30ఏళ్లుగా రంగారెడ్డి, నల్లగొండ, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్, రాచకొండ పొలిస్ కమిషనరేట్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్నాడు వెంకటేష్.
ఇప్పటి వరకు 300కుపైగా దొంగతనాలు చేసినట్లు నిందితుడు వెంకటేష్ తెలిపాడు. 2013 నుంచి ఇప్పటి వరకు 78 కేసుల్లో వెంకటేష్ నిందితుడు అని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. ఇతను గతేడాది ఆగష్టులో జైలు నుంచి రిలీజ్ అయినట్లు తెలిపారు. మెుదట్లో ట్రాన్స్ ఫార్మర్స్ కాపర్ వైర్, కేబుల్ వైర్లు వెంకటేష్ దొంగిలించేవాడని తెలిపారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలన్న దురాశతో దేవాలయాల్లో విగ్రహాలు దొంగతనం మెదలుపెట్టాడన్నారు.
ఇకపోతే సారంగ సంజీవులుకు నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నేరాలు చెయ్యడంతోపాటు సోదరుడు వెంకటేష్ తో కలిసి కాపర్, కేబుల్ వైర్ దొంగతనాలు చేసేవాడని తెలిపారు. సంజీవులపై పలు జిల్లాల్లో 12 కేసుల్లో నిందితుడు. తాజాగా ఇద్దరు కలిసి దేవాలయాల్లో విగ్రహాలను దొంగిలిస్తూ పోలీసులకు దొరికిపోయారు.