కరోనా పాజిటివ్.. తగ్గదేమోనన్న భయం: చెట్టుకొకరు, కల్వర్టుకు మరొకరు ఉరేసుకుని ఆత్మహత్య
కరోనా సోకిన వారు తిరిగి కోలుకోవాలంటే గుండె ధైర్యం, మనో నిబ్బరం మెండుగా ఉండాలని వైద్యులు సూచిస్తున్న సంగతి తెలిసిందే. ఎలాంటి పరిస్థితుల్లోనూ బెదరకుండా వున్నప్పుడే మందులు బాగా పనిచేస్తాయని చెబుతున్నారు. కానీ కొందరు మాత్రం కరోనా వస్తే ఇక తగ్గదనే భయంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు
కరోనా సోకిన వారు తిరిగి కోలుకోవాలంటే గుండె ధైర్యం, మనో నిబ్బరం మెండుగా ఉండాలని వైద్యులు సూచిస్తున్న సంగతి తెలిసిందే. ఎలాంటి పరిస్థితుల్లోనూ బెదరకుండా వున్నప్పుడే మందులు బాగా పనిచేస్తాయని చెబుతున్నారు. కానీ కొందరు మాత్రం కరోనా వస్తే ఇక తగ్గదనే భయంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరోనా భయంతో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. మూడు రోజుల కిందట పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్లా గ్రామానికి చెందిన పల్లెర్ల మహేష్ అనే యువకుడు కరోనా సోకిందన్న భయంతో బావి వద్ద ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతనిని గమనించిన స్థానికులు మహేశ్ను కరీంనగర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. మృతునికి భార్య ఇద్దరు కూతుర్లు ఉన్నారు. మహేష్కు కరోనా పాజిటివ్ రాగా సుల్తానాబాద్ ఐసోలేషన్లో వారం రోజుల పాటు చికిత్స పొందాడు. ఇంటికి వచ్చిన తర్వాత మరోసారి వ్యాధి తిరగబెట్టడంతో భయానికి లోనై ఆత్మహత్యకు చేసుకున్నట్లు బంధువులు తెలిపారు.
Also Read:థర్ద్ వేవ్ను ఎదుర్కొనేందుకు సిద్దం: కరోనాపై హైకోర్టుకు కేసీఆర్ సర్కార్ నివేదిక
మరో ఘటనలో పెద్దపెల్లి జిల్లా ఎలిగేడు మండలం నర్సాపూర్కు చెందిన కనకయ్య అనే వృద్ధుడు సైతం కరోనా భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కనకయ్యకు ఐదు రోజుల కిందట కరోనా పాజిటివ్గా నిర్దారణ అయ్యింది. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన అతను మంగళవారం స్థానికంగా వున్న కల్వర్టు పిల్లర్కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.