ఏపీ లోని తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం, అనురు గ్రామ నివాసి ఎర్రం శెట్టి చరణ్ విగ్నేష్ అలియాస్ పాండు(19) దినసరి కూలీ. పదహారేళ్ళ వయసు నుంచే తాళం వేసి ఉన్న ఇళ్లల్లో చోరీలు చేయడం ప్రారంభించాడు.
హైదరాబాద్ : బాల్యంనుంచే చోరీల బాట పట్టాడు.జువెనైల్ హోం కు వెళ్లినా అతడిలో మార్పు రాలేదు. 18 ఏళ్ళ వయస్సు నిండిన తర్వాత చోరీలు చేస్తూ మలక్పేట పోలీసులకు పట్టుబడ్డాడు. 19 ఏళ్ల వయసు వచ్చేసరికి అతడు చేసిన చోరీల సంఖ్య 14కు చేరింది.
మలక్ పేట క్రైమ్ ఇన్స్పెక్టర్ నాను నాయక్ తెలిపిన వివరాల ప్రకారం... ఏపీ లోని తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం, అనురు గ్రామ నివాసి ఎర్రం శెట్టి చరణ్ విగ్నేష్ అలియాస్ పాండు(19) దినసరి కూలీ. పదహారేళ్ళ వయసు నుంచే తాళం వేసి ఉన్న ఇళ్లల్లో చోరీలు చేయడం ప్రారంభించాడు.
ఈనెల 24న మూసారాంబాగ్ ఈస్ట్ ప్రశాంత్ నగర్ కాలనీ లోని సింధూర హైట్స్ లో నివసిస్తున్న గంగారావు ఇంటి తాళాలు పగలగొట్టి అల్మారాలో భద్రపరిచిన నాలుగు తులాల బంగారు నగలు చోరీ చేశాడు. మలక్ పేట పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించి సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు.
అతడి కదలికలపై నిఘా పెట్టారు. గురువారం కొత్తపేటలో హాస్టల్ లో పనిచేస్తున్న తల్లిదండ్రులను కలవడానికి వెళ్లగానే, పట్టుకుని నాలుగు తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ పరిధిలో 13, నగర పోలీస్ కమిషనర్ లో ఒక చోరీ చేశాడని తెలిపారు.
