శామ్సంగ్ 5జీ ‘ఎ90’ ఫోన్: ఇండియాలో లాంచ్ సాద్యమేనా?
5జీతో రూపుదిద్దుకుంటున్న శామ్ సంగ్ గెలాక్సీ ఎ90 ఫోన్ త్వరలో అంతర్జాతీయ విపణిలో అడుగు పెట్టనున్నది. వచ్చే ఏడాది భారతదేశంలో 5జీ సేవలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఫోన్ను ఇండియా విపణిలో శామ్సంగ్ విడుదల చేస్తుందా? లేదా? అన్నదే అనుమానంగా ఉంది.
న్యూఢిల్లీ: దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శామ్సంగ్ ‘ఎ’ సిరీస్లో మరో ఫోన్ను పరిచయం చేయనున్నది. శామ్సంగ్ గెలాక్సీ ఏ90 పేరుతో ఆవిష్కరించడానికి సిద్ధం అవుతోంది. ఈ స్మార్ట్ఫోన్ 5జీ టెక్నాలజీతో వస్తున్న, అంత్యంత సరసమైన మొబైల్ ఫోన్ అని తాజా నివేదికలు చెబుతున్నాయి.
ఎప్పుడు విపణిలోకి ఆవిష్కరిస్తారన్న విషయాన్ని శామ్సంగ్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ స్మార్ట్ఫోన్కు సంబంధించిన అధికారిక పోస్టర్, రీటైల్ బాక్స్తోపాటు కొన్ని ఫోటోలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. దీని ప్రకారం స్లిమ్ బెజెల్స్ ఇన్ఫినిటీ యూ డిస్ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా, సూపర్-ఫాస్ట్ ఛార్జింగ్ ప్రధాన ఆకర్షణ కానున్నాయి.
శామ్సంగ్ ఏ 90 మోడల్ స్మార్ట్ ఫోన్ ధర, బ్యాటరీ సామర్థ్యం లాంటి ఇతర సమాచారం వెల్లడి కావాల్సి ఉంది. అలాగే భారతదేశంలో వచ్చే ఏడాది నాటికి 5జీ సిద్ధం కానుంది. ఈ నేపథ్యంలో శామ్సంగ్ ఏ 90 4జీ వేరియంట్ మోడల్ ఫోన్ను ఇండియాలో విడుదల చేస్తుందా? వచ్చే ఏడాది వరకు వేచి చూస్తుందా? అన్న సంగతి స్పష్టం కాలేదు.
6.7 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే గల శామ్ సంగ్ ఏ 90 ఫోన్ ఆక్టా-కోర్ చిప్ కలిగి ఉంటుంది. 128 జీబీ స్టోరేజ్తోపాటు 8జీబీ ర్యామ్ సామర్థ్యం గల ఈ ఫోన్లో 48+8+5 ఎంపీ రియర్ కెమెరా, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటాయి.