‘బిగ్సీ’ వేదికగా తెలుగు రాష్ట్రాల్లోకి ‘నోకియా 4.2’
భారతదేశంలోని స్మార్ట్ ఫోన్ల వినియోగదారులంతా చౌక ఫోన్ల వైపు మళ్లుతున్న నేపథ్యంలో హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ ఆ విభాగంలో పట్టు సాధించందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే భారత మార్కెట్లోకి అడుగు పెట్టింది నోకియా 4.2 స్మార్ట్ ఫోన్.
భారతీయ మొబైల్ ఫోన్ వినియోగదారులు చౌక ఫోన్ల వినియోగం వైపు మళ్లుతున్నారు. ఈ నేపథ్యంలో హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ రూ.7000 - రూ.14వేల మధ్య విలువ గల ఫోన్ల తయారీపై ద్రుష్టిని సారించింది. శరవేగంగా దూసుకెళ్లే ఈ సెగ్మెంట్లో రూ.45 కోట్ల గ్రోథ్ లభిస్తుందని అంచనా వేస్తోంది.
నోకియా సెల్ఫోన్ల తయారీ కంపెనీ హెచ్ఎండీ గ్లోబల్ కొత్తగా ఉత్పత్తిచేసిన నోకియా 4.2 స్మార్ట్ఫోన్ను శనివారం తెలుగు రాష్ట్రాల విపణిలోకి విడుదల చేసింది. మాదాపూర్లోని బిగ్ సి షోరూమ్ వేదికగా నోకియా 4.2 ఫోన్ను హెచ్ఎండీ గ్లోబల్ సౌత్ జనరల్ మేనేజర్ టి.ఎస్.శ్రీధర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ అత్యాధునిక ఫీచర్లతో భారతీయ వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా ఈ ఫోన్ను రూపొందించినట్లు తెలిపారు. 3 జీబీ రామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 13 మెగాపిక్సెల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయని తెలిపారు.
హైఎండ్ ఫోన్లో ఉండే గుగూల్ అసిస్టెంట్ బటన్తోపాటు కొత్తగా రూపొందించిన నోటిఫికేషన్ లైట్, బయెమెట్రిక్ ఫేస్ అన్లాక్ వంటి సదుపాయాలు ఈ ఫోన్ ప్రత్యేకమని టీఎస్ శ్రీధర్ అన్నారు.
నోకియా 4.2 ఫోన్ల కోసం వినియోగదారుల నుంచి ప్రీబుకింగ్ను ప్రారంభించామని, ప్రీబుకింగ్ చేసుకున్న వారికి ఈనెల 14న ఫోన్లు అందిస్తామని హెచ్ఎండీ గ్లోబల్ సౌత్ జనరల్ మేనేజర్ టి.ఎస్.శ్రీధర్ చెప్పారు.
హెచ్డీఎఫ్సీ డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా కోనుగోలుపై 10శాతం క్యాష్బ్యాక్, రూ.3500 విలువైన స్క్రీన్ రిప్లేస్మెంట్, బ్లూటూత్ స్పీకర్ను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. నలుపు, గులాబీ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుందన్నారు.
ధర రూ.10,990గా నిర్ణయించినట్లు చెప్పారు. బిగ్ సి సంస్థ వ్యవస్థాపకులు, సీఎండీ ఎం.బాలుచౌదరి మాట్లాడుతూ, నోకియా 4.2 ఫోన్ను తెలుగు రాష్ట్రాల్లోని 225కు పైగా ఉన్న బిగ్ సి కేంద్రాల్లో విక్రయించనున్నట్లు తెలిపారు.
ఏడాది కాలంగా హెచ్ఎండీ గ్లోబల్ 12 నూతన మోడల్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు అంతర్జాతీయంగా ఐదు మోడల్ ఫోన్లు ఆవిష్కరించగా, భారతదేశ విపణిలోకి నోకియా 4.2 మాత్రమే విడుదలైంది.