Asianet News TeluguAsianet News Telugu

పాప్-ఆప్.. మల్లీ కెమెరా స్మార్ట్ ఫోన్లకే యూజర్ల మొగ్గు

ప్రారంభంలో కెమెరా ఫోన్ అంటే ఎంతో ఆసక్తి చూపారు. కానీ ఇప్పుడు ఒకటి కాదు రెండు కాదు నాలుగు, ఐదు కెమెరాలతో కూడిన స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. మల్టీ కెమెరా ఫోన్లకే కస్టమర్లు తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. సోషల్ మీడియా వేదికల పుణ్యమా? అని పాప్-అప్- మోడల్ ఫోన్లకు ఎక్కువ డిమాండ్ ఏర్పడింది.  

Multi-camera first priority on smartphone users
Author
Hyderabad, First Published Aug 1, 2019, 11:04 AM IST

హైదరాబాద్: మంచి కెమెరా, బిగ్ స్క్రీన్, అధిక సామర్థ్యం ఉన్న బ్యాటరీ, ర్యామ్‌ తదితర అంశాలు ఇటీవలి వరకు స్మార్ట్‌ఫోన్‌ యూజర్ల తొలి ప్రాధాన్యాలు.. ఇప్పుడీ ట్రెండ్‌ మారింది. సోషల్ మీడియా పుణ్యమా? అని అత్యాధునిక పాప్‌–అప్, మల్టీ కెమెరా స్మార్ట్‌ఫోనే వినియోగదారుల ఏకైక డిమాండ్‌గా నిలుస్తోంది. 

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఒకేవైపు నాలుగు కెమెరాలు ఉన్న మోడళ్లు ఇప్పటికే మార్కెట్లోకి వచ్చి చేరాయి. ఇటీవలే ఐదు కెమెరాలతో నోకియా 9 ప్యూర్‌వ్యూ ఫోన్‌ను తెచ్చింది. 64 మెగా పిక్సెల్‌ కెమెరాతో కూడిన ఫోన్లు కొద్ది రోజుల్లో కస్టమర్ల చేతుల్లో క్లిక్‌మనిపించనున్నాయి. కెమెరాను కేంద్రంగా చేసుకునే మోడళ్ల రూపకల్పనలో కంపెనీలు నిమగ్నమవడం ఇక్కడ గమనార్హం.

ప్రస్తుత పరిస్థితుల్లో కెమెరా టెక్నాలజీతోనే కంపెనీలు తమ ప్రత్యేకతను చాటుకోవాల్సిందేనని జర్మనీకి చెందిన ఆప్టికల్స్‌ తయారీ దిగ్గజం జాయిస్‌ సీఈవో మైఖేల్‌ కాష్‌కే స్పష్టం చేశారు. కెమెరాల సామర్థ్యం పెరగడంతో స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు జోరు మీదున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

స్మార్ట్‌ఫోన్ల డిజైన్, వాటిల్లో చేర్చే ఫీచర్ల విషయంలో ఎప్పటికప్పుడు మార్పులు వస్తూనే ఉన్నాయి. స్క్రీన్‌ చుట్టుపక్కల ఉండే ప్లాస్టిక్, మెటల్‌తో కూడిన బెజెల్‌ తగ్గుతోంది. బెజెల్‌ లెస్‌ మోడళ్ల రాకతో డిస్‌ప్లే సైజు పెరిగింది. ర్యామ్‌ సామర్థ్యం 12 జీబీకి, ఇంటర్నల్‌ మెమరీ 256 జీబీ వరకు చేరింది. బ్యాటరీ సామర్థ్యం 5,000 ఎంఏహెచ్‌ దాటింది. మార్పులెన్ని వచచినా ఇన్ని మార్పులు వచ్చినప్పటికీ వినియోగదార్ల ప్రాధాన్యత మాత్రం కెమెరాకేనని నిపుణులు తెలిపారు.

కంపెనీలు పోటీపడీ మరీ లెన్స్‌పై దృష్టిసారిస్తున్నాయి. అధిక మెగా పిక్సెల్‌తోపాటు మల్టిపుల్‌ కెమెరాల రాక అధికమైందని స్మార్ట్ ఫోన్ల తయారీదారులు, విక్రేతలు చెబుతున్నారు. మల్టిపుల్‌ లెన్స్‌ కెమెరాలు, లార్జ్‌ సైజ్‌ ఇమేజ్‌ సెన్సార్ల అమ్మకాల జోరుతో జపాన్‌ టెక్నాలజీ దిగ్గజం సోనీ కార్పొరేషన్‌ జూన్‌ త్రైమాసికంలో రికార్డు స్థాయిలో రూ.14,490 కోట్ల నిర్వహణ లాభాలను ఆర్జించింది. ఈ మొత్తం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 18.4%అధికంగా ఉందంటే ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది.  

ప్రపంచ స్మార్ట్‌ఫోన్‌ రంగంలో మల్టీ కెమెరాలు సందడి చేస్తున్నాయి. బెజెల్‌ లేకుండా పూర్తి డిస్‌ప్లేతో ఫోన్లను అందించేందుకు పాప్‌–అప్‌ సెల్ఫీ కెమెరాలతో మోడళ్లను ప్రవేశపెడుతున్నాయి. ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్, ఆప్టికల్‌ జూమ్, ఫాస్ట్‌ ఆటో ఫోకస్, వైడ్‌ యాంగిల్‌ వంటి ఫీచర్లతో రంగ ప్రవేశం చేస్తున్నాయి. ఇక రెండు బ్యాక్ కెమెరాలతో మొదలై ఐదు కెమెరాల స్థాయికి వచ్చిందంటే ట్రెండ్‌ను అర్థం చేసుకోవచ్చు.

‘ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో అందమైన ఫొటోలను పోస్ట్‌ చేసేందుకు కస్టమర్లు పాప్‌–అప్‌తోపాటు వెనుకవైపు మూడు, నాలుగు కెమెరాలు ఉన్న ఫోన్లు కోరుకుంటున్నారు. మార్కెట్లో  పాప్‌–అప్‌ కెమెరా మోడల్‌ ఇప్పుడు రూ.18 వేలకూ లభిస్తోంది.

వివిధ కంపెనీల నుంచి క్వాడ్, ట్రిపుల్‌ కెమెరా మోడళ్లు 90 వరకు ఉంటాయి. 48 మెగాపిక్సెల్‌తో ప్రధాన కెమెరా ఉన్న మోడళ్లు 60 దాకా ఉన్నాయి. వీటిలో చాలామటుకు ఇప్పటికే మార్కెట్లోకి వచ్చి చేరాయి. 48 ఎంపీతో కూడిన డ్యూయల్‌ ఫ్రంట్‌ కెమెరా ఫోన్లూ వచ్చి చేరాయి. 48 ఎంపీ రొటేటింగ్‌ పాప్‌–అప్‌ కెమెరాతో  శామ్‌సంగ్‌ గెలాక్సీ ఏ80ని ఆవిష్కరించింది. 64 ఎంపీ ప్రధాన కెమెరాతో షియోమీ, రియల్‌మీ త్వరలో రంగంలోకి దిగుతున్నాయి. ఈ ఏడాది దేశంలో 2019లో 15–16 కోట్ల స్మార్ట్‌ఫోన్లు అమ్ముడవుతాయని అంచనా.
 

Follow Us:
Download App:
  • android
  • ios